కాలపరిమితి అయిపోయిందని కొత్తగా టెండర్లు పాడిన వారికి షాపులు ఇవ్వాలంటూ నగరపాలక రెవెన్యూ అధికారులు దుకాణ యాజమానులకు తేల్చి చెప్పారు.
అనంతపురం: కాలపరిమితి అయిపోయిందని కొత్తగా టెండర్లు పాడిన వారికి షాపులు ఇవ్వాలంటూ నగరపాలక రెవెన్యూ అధికారులు దుకాణ యాజమానులకు తేల్చి చెప్పారు. బుధవారం అనంతపురం నగరం పాతవూరులోని మునిసిపల్ షాపులను మూత వేసే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దుకణా యజమానులు, సీపీఎం నేతలు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. మరో మూడేళ్లు గడువు పెంచాలంటూ వేడుకున్నారు.
కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఏవిధంగా పోలీసుల జోక్యంతో మూసేందుకు వస్తారని అక్కడ దుకాణ యజమానులు నరసింహారెడ్డి, ఖాదర్బాషా, వెంకటనరసింహ, నరసింహులు, సీపీఎం నేత ముస్కిన్ అన్నారు. అందుకు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. 25 ఏళ్లు దాటడంతోనే టెండర్లు వేయడం జరిగిందని తదితర అధికారులు చెప్పారు. కాలపరిమితి అయిపోవడంతోనే నూతన గుత్తేదార్లకు షాపులు అప్పజెప్పాలన్నారు. అందుకు వ్యాపారులు టెండర్లు సైతం ఇష్టారాజ్యంగా జరిగాయని, తమకు ఆ విషయాన్ని తెలియజేసింటే తాము టెండర్లలో దిగే వారమన్నారు.