ముందువెళ్లిన వారికే రేషన్ | Ration shops to be distributed government Goods cut | Sakshi
Sakshi News home page

ముందువెళ్లిన వారికే రేషన్

Nov 7 2013 2:41 AM | Updated on Sep 2 2017 12:20 AM

రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులపైనా ప్రభుత్వం కోత విధించింది.

భీమవరం, న్యూస్‌లైన్ : రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులపైనా ప్రభుత్వం కోత విధించింది.   బోగస్ కార్డులను సాకుగా చూపించి నెలవారీ కోటాలో 15 శాతం తగ్గించేసింది. ముందు వచ్చిన వారికే సరుకులు.. వెనుకవస్తే మొండి చెయ్యే.. అన్నరీతిలో ప్రస్తుత పరిస్థితి తయారైంది.  రేషన్ కార్డుదారులు లబోదిబోమంటుండగా, ముందస్తు సమాచారం కూడా లేకుండా కోత విధించడంతో డీలర్లు డీలాపడ్డారు. ఈ నెల నుంచే ఈ కోతలు మొదలయ్యాయి. గత నెలతో పోలిస్తే  ఈ నెల రేషన్‌కుగాను డిపోలకు  85శాతం సరుకులను మాత్రమే విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిర్ణీత తేదీల్లో రేషన్ దుకాణానికి ఎవరు ముందు వస్తే వారికే సరుకులు ఇవ్వనున్నారు.
 
 రేషన్ కార్డుదారులకు తాము ఏమి సమాధానం చెప్పాలంటూ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డులను తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అడ్డదారిన రాత్రికిరాత్రి ఉత్తర్వులు జారీ చేసిందనే చర్చ సాగుతోంది. జిల్లాలో 2వేల 86 రేషన్ షాపులకుగాను 11లక్షల 20 వేల 37 రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా సుమారు 15వేల 303 టన్నుల బియ్యాన్ని రేషన్ షాపులకు ప్రభుత్వం సరఫరా చేసేది. దీంతోపాటు ‘అమ్మహస్తం’ పథకంలో భాగంగా 9 సరుకులను కార్డుదారులకు ఒక్కో సరుకుకు చెందిన ప్యాకెట్లు 11 లక్షల 20 వేల 437  రావాల్సి ఉంది. 15 శాతం కోత కారణంగా నవంబర్ నెల కోటాకు  13,400 టన్నులు బియ్యం,  ఒక్కో సరుకుకు సంబంధించిన ప్యాకెట్లు 9 లక్షల 52 వేల 371 వచ్చాయి.  ప్రభుత్వ  తాజా నిర్ణయంతో ఇక రేషన్ దుకాణానికి ముందెళ్ళిన వారికే సరుకు దక్కుతుంది. వెనుక వెళ్లిన వారు వెనుదిరగాల్సిందే. 
 
 కోత వాస్తవమే.. డీఎస్‌వో చౌకడిపోల ద్వారా అందిస్తున్న సరుకుల్లో నవంబర్ 
 నెల కోటాలో ప్రభుత్వం 15శాతం కోత విధించిన మాట వాస్తవమేనని జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌వో) డి.శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయనను ‘న్యూస్‌లైన్’ ఫోనులో సంప్రదిం చగా పైవిధంగా స్పందించారు. పూర్తిస్థాయిలో సరుకులు సరఫరా చేయాలని కోరుతూ జేసీ రాష్ర్త ప్రభుత్వానికి నివేదిక పంపించారని, కొద్ది రోజుల్లోనే కోత విధించిన సరుకులు కూడా కార్డుదారులకు అందుతాయని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement