తెలంగాణలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు : మోదీ
న్యూఢిల్లీ : జాతీయ స్ధాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు మహాకూటమి, ఫెడరల్ ఫ్రంట్ల ఏర్పాటు ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలు మోదీ ఓటమే అజెండాగా ఏకమవడాన్ని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ప్రయోగం విఫలమైందని అన్నారు.
తెలంగాణలో కూటమికి చొరవ చూపిన ఏపీ సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని, అక్కడే కూటమికి తొలిదెబ్బ తగిలిందన్నారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు కాంగ్రెస్ పంచన చేరారని మండిపడ్డారు. మోదీ ఆశీస్సులతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారన్న చంద్రబాబు ఆరోపణలను తిప్పికొట్టారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పూనుకున్నారన్న విషయం తనకు తెలియదని మోదీ వ్యాఖ్యానించారు.