తల్లిని చంపిన తనయుడు | Mother murdered by Son in Bellam Pally | Sakshi
Sakshi News home page

తల్లిని చంపిన తనయుడు

Aug 7 2013 4:59 AM | Updated on Jul 30 2018 8:27 PM

నవ మాసాలు మోసి కని.. పెంచిన తల్లిని కర్కశంగా హత్య చేశాడో తనయుడు. ఈ సంఘటన బెల్లంపల్లి పట్టణంలో చోటు చేసుకుంది.

బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : నవ మాసాలు మోసి కని.. పెంచిన తల్లిని కర్కశంగా హత్య చేశాడో తనయుడు. ఈ సంఘటన బెల్లంపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ ఎస్సై కె.స్వామి కథనం ప్రకారం.. పట్టణంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ బస్తీకి చెందిన సింగరేణి రిటైర్డు కార్మికుడు ఎస్‌కె.రంజాన్, చాంద్‌బీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వరంగల్‌లో ఉంటున్నాడు. రెండో కుమారుడు తాజొద్దీన్(24) కొంతకాలంగా మతిస్థిమితం తప్పినట్లుగా ప్రవర్తిస్తున్నాడు.

సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తల్లి చాంద్‌బీతో గొడవపడ్డాడు. భోజనంలో విషం కలిపావంటూ వాగ్వాదానికి దిగాడు. కన్నకొడుకు విషం పెట్టే దుర్మార్గమైన చర్యకు తానెలా పాల్పడుతానంటూ ఆమె ఎంత మొత్తుకున్నా వినలేదు. తండ్రి రంజాన్ ఎదుటనే దాడికి యత్నించాడు. అప్పటికే అర్ధరాత్రి దాటడంతో కొడుకును వారించి నిద్రకు ఉపక్రమించింది. చాంద్‌బీ(45 నిద్రలోకి జారుకోగానే రోకలిబండతో ఆమె తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement