ఆత్మహత్యకు పాల్బడిన సుబ్రమణ్యం మొబైల్లో పెట్టిన మెసేజ్
- బర్త్డే కేక్ తేస్తానని కూతురు పుట్టినరోజే ఆత్మహత్య
- బి.కొత్తకోటలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉదంతం
- ఆత్మహత్యకు ముందు తల్లితో ఫోన్లో మాట్లాడి ఆర్థిక ఇబ్బందులపై ఆవేదన
- తర్వాత కొంతసేపటికే ఉరివేసుకుని మృతి
బి.కొత్తకోట(అన్నమయ్య జిల్లా): ఆఫీసుకు వెళ్తున్నా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు బిడ్డ పుట్టినరోజుకు బర్త్డే కేక్ తీసుకొస్తానని అని చెప్పిన భర్త కానరాని లోకానికి వెళ్లిపోయాడు. నా పుట్టినరోజుకు కేక్ తీసుకొస్తాడని వెళ్లిన నాన్న ఇంకెప్పటికి కేక్ తీసుకురాలేడని ఆ బిడ్డకు, సాయంత్రం తిరిగి వస్తానని చెప్పిన వెళ్లిన భర్త ఇక ఎన్ని సాయంత్రాలు గడచినా ఆ మాటలు ఇక వినబడవని తెలిసి ఆ కుటుబం కుప్పకూలిపోయింది. నీకు..బిడ్డలకు నరకాన్ని ఇచ్చి వెళ్లిపోతున్నా అని భార్యకు మెసేజ్ పెట్టి ఆత్మహత్యకు పాల్బడిన భర్త గురించి గంటల వ్యవధిలో మరణవార్త వినడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. అభంశుభం తెలియని ఇద్దరు ఆడపిల్లలు, భార్య తనపై ఆధారపడి ఉన్నారన్న విషయం తెలిసినా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్బడిన సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బి.సుబ్రమణ్యం (36) ఉదంతం ఆవేదనకు గురి చేస్తోంది.
సోమవారం ఉదయం బి.కొత్తకోటలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు. రామసముద్రానికి చెందిన బి.సుబ్రమణ్యం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. గతేడాది జూలైలో బి.కొత్తకోట నగర పంచాయతీ తాకాటంవారిపల్లె సచివాలయానికి బదిలీ అవ్వగా స్థానిక బైపాస్రోడ్డులో కుటుంబంతో నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సౌమ్య, ఐశ్వర్య (4), హైందవి (2) సంతానం. తల్లి నీలమ్మ ఉండగా తండ్రి రత్నప్ప మతి చెందాడు.
ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు కావడంతో సుబ్రమణ్యం కుటుంబంతో కలిసి బి.కొత్తకోట సమీపంలోని కర్ణాటకకు చెందిన నాగిరెడ్డిపల్లెలోని అత్తారింటికి వెళ్లాడు. రాత్రి అక్కడే ఉండగా సోమవారం ఉదయం ఏడు గంటలకు ఆఫీసుకు బి.కొత్తకోట వెళ్తున్నానని, కుమార్తె ఐశ్వర్య జన్మదినం కావడంతో సాయంత్రం వచ్చేటప్పుడు కేక్ తీసుకొస్తానంటూ చెప్పి ఉదయం ఏడు గంటలకు నాగిరెడ్డిపల్లె నుంచి బి.కొత్తకోటకు బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న తర్వాత 7.50 గంటలకు రామసముద్రంలో ఉంటున్న తల్లి నీలమ్మతో ఫోన్లో మాట్లాడాడు.
ఈ రోజు బిడ్డ ఐశ్వర్య పుట్టినరోజని కేక్ తీసుకోవాలని చెబుతూనే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని భారంగా మాట్లాడాడు. డబ్బులు లేవని, ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పుకున్నాడు. ఈ మాటలకు ఆందోళనకు గురైన నీలమ్మ విషయాన్ని కోడలు సౌమ్యకు చెప్పడంతో 8 గంటలకు భార్య సౌమ్య, తల్లి నీలమ్మ, కుటుంబీకులు ఫోన్లో మాట్లాడేందుకు కాల్ చేసినా తీయలేదు. ఆత్మహత్యకు సిద్దంకావడంతో అంతకుముందు భార్య సౌమ్య ఫోన్కు..నీకు, బిడ్డలకి నరకాన్ని ఇచ్చి నేను వెళ్లిపోతున్నాను క్షమించండి అంటూ భార్య ఫోన్ నంబర్కు మెసేజ్ టైప్ చేశాడు కాని సెండ్ చేయలేదు.
ఆ తర్వాత ఇంటిలోనే శ్లాబుకు ఉన్న కొక్కికి వేసిన చీర, తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్బడ్డాడు. ఉదయం 8–9.15 గంటల మధ్య ఆత్మహత్యకు పాల్బడినట్టుగా పోలీసులు గుర్తించారు. సుబ్రమణ్యం ఆత్మహత్యకు పాల్బడిన విషయాన్ని స్థానికులు గుర్తించి ఇంటి యజమానికి, పొరుగు వాళ్లకు చెప్పడంతో వారు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మతి చెందినట్టు నిర్దారించారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ కరీముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారించారు. తల్లి నీలమ్మ ఫిర్యాదు మేరకు..సుబ్రమణ్యం అర్థిక ఇబ్బందులతో ఉన్నాడని, ఇప్పటికే పలుమార్లు ఆర్థికంగా సహయపడ్డామని, మళ్లీ ఆర్థిక సమస్యలతో తమతో చెప్పుకోలేని ఆత్మహత్యకు పాల్బడినట్టు పేర్కొనడంతో కేసు నమోదు చేశారు. మతదేహాన్ని పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
AP: పని ఒత్తిడి.. ఇద్దరు సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్మ


