విజయవాడ: పని ఒత్తిడి భరించలేక ఇద్దరు సచివాలయ ఉద్యోగులు వరుసగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఏపీలో అలజడి సృష్టిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా మోపిదేవి సచివాలయంలో ఏఎన్ఎంగా పని చేస్తున్న దాసి సబిత ఆత్మహత్యా యత్నం చేయగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు.
ఇదిలా ఉంచితే, మరో సచివాలయ ఉద్యోగి ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 9వ తేదీ) ఆత్మహత్య చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా బి. కొత్తపేటలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక బైపాస్ రోడ్ లోని తన ఇంటిలో ఇవాళ ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు సుబ్రహ్మణ్యం అనే వెల్ఫేర్ అసిస్టెంట్.
మృతుడి స్వగ్రామం రామసముద్రం మండలం ఇటీవల బదిలీల్లో భాగంగా బి.కొత్తకోట వచ్చాడు సుబ్రహ్మణ్యం. అయితే సుబ్రహ్మణ్యంకు పని ఒత్తిడి పెరిగిపోయింది. డబ్యూఈఏ(వార్డు ఎడ్యకేషన్ అసిస్టెంట్), డీఏ(డేటా అనాలిసిస్), పీఎస్(పబ్లిక్ సర్వీసెస్), బీఎల్ఓ(బూత్ లెవల్ ఆఫీసర్, ఈఎన్ఏ(ఎంక్వరీ యాక్టివిటీ) తదితర బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో యూఎఫ్ఎస్(అర్బన్ ఫ్రేమ్ సర్వే)లో భాగంగా 888 గృహాలు అతనికి కేటాయించారు. ఇలా పనిభారం పెరిగిపోయింది. దాంతో విరామం లేకుండా పనిచేసి అత్యధిక బాధ్యతల ఒత్తిడి తట్టుకోలేక పోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై బి.కొత్తపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వలంటీర్ల వ్యవస్థను అటకెక్కించేసిన కూటమి ప్రభుత్వం..
ఏపీలో పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా ఐదేళ్ల పాటు లబ్దిదారుల ఇళ్ల వద్దనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న వలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది ఎన్నికల ముందు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వారి గౌరవ వేతనం రెట్టింపు చేస్తామని ఊరూవాడా హోరెత్తించిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను చిదిమేశారు.
పెద్దఎత్తున ఉపాధి..
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు విజయవంతంగా కొనసాగిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఉపాధి పొందారు. అప్పట్లో 20–25 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 శాతం మంది, 26–30 ఏళ్ల మధ్య వారు 36 శాతం, 31–35 ఏళ్ల మధ్య వారు 28 శాతం కలిపి మొత్తం 91 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ‘వలంటీర్’గా ఉపాధి పొందారు.
మరోవైపు.. వలంటీర్లుగా అప్పటి ప్రభుత్వం నియమించిన వారిలో 49 శాతం మంది బీసీలు, 27 శాతం మంది ఎస్సీలు, ఏడు శాతం మంది ఎస్టీలున్నారు. అలాగే, మొత్తం మీద 1,25,781 మంది మహిళలు ఉపాధి పొందారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆ వ్యవస్థ కాస్త తెరమరుగై పోయింది. దాంతో లెక్కల్లో మాత్రమే ఉన్న సచివాలయ ఉద్యోగులపై పని భారం అధికమైంది. తాజాగా జరిగిన ఈ రెండు ఆత్మహత్మ ఘటనలే అందుకు అద్దం పడుతున్నాయి.


