‘కేవలం బాబు చెప్పిందే పవన్‌ నాయుడుకి వినిపిస్తోంది’

Minister Perni Nani Slams Pawan Kalyan Over Sand Issue - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న మంచి పనులు పవన్‌ కళ్యాణ్‌కు కనిపించడం లేదని, కేవలం చంద్రబాబు చెప్పిందే వినిపిస్తోందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఇచ్చిన రైతు భరోసా వంటి బృహత్కర పథకాలు పవన్‌ నాయుడుకి కనబడటం లేదని ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ఎన్నో మంచి పనులపై ఎన్నడైనా ట్వీట్‌ చేశావా అంటూ ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం పవన్‌ నాయుడుకి చంద్రబాబు చెప్పిన ఇసు​క తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శించారు. గోదావరి నదిలో జూన్‌ 25 నుంచి వరద ప్రవహిస్తోందని, కృష్ణా నదిలో నేటికి గేట్లు తెరిచే ఉన్నాయనే విషయం తెలుసా అంటూ ప్రశ్నించారు. 

‘భవన కార్మికుల డబ్బులు మింగేసిన అచ్చెన్నాయుడుని పక్కన పెట్టుకుని విశాఖపట్నంలో భవన కార్మికుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు హయాంలో భవన కార్మికులకు జరిగిన ద్రోహంపై ఎప్పుడైనా పవన్‌ నాయుడు ప్రశ్నించారా?. పవన్‌ నాయుడుకి పెళ్లిళ్ల మీద మక్కువ కాబట్టి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అందరూ అలా చేసుకోరు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజా సేవ మీద మక్కువ కాబట్టి రాజకీయం చేస్తున్నారు. పవన్‌ తల్లిదండ్రులు రోజూ సంస్కారం నేర్పుతారా?. ఎందుకంటే విశాఖ సభలో సీఎంపై ఇష్టాను సారంగా మాట్లాడారు. కానీ నేడు నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారని అందుకే ఎవరినీ దూషించని అనడం విడ్డూరంగా ఉంది. అంటే విశాఖ సభ రోజు మీ అమ్మా నాన్నా సంస్కారం నేర్పలేదా?. మా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు కాబట్టే ఏనాడు మిమ్మల్ని విమర్శించలేదు. ఈరోజు వెంకయ్యనాయుడిని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నావ్‌.. కానీ గతంలో అత్యంత దారుణంగా తిట్టింది నిజమా కాదా?’అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top