
మట్కాష్..!
కర్నూలు : పోలీస్ శాఖలో పని చేసి రిటైర్ అయిన ఒక పోలీస్ అధికారికి మట్కాపై దృష్టి మళ్లింది. మట్కాలో ఒక నంబర్ ఎంచుకున్నాడు. అదృష్టం కలిసి వచ్చింది.
కర్నూలు :
పోలీస్ శాఖలో పని చేసి రిటైర్ అయిన ఒక పోలీస్ అధికారికి మట్కాపై దృష్టి మళ్లింది. మట్కాలో ఒక నంబర్ ఎంచుకున్నాడు. అదృష్టం కలిసి వచ్చింది. రూ.16 లక్షలు వచ్చాయి. ఆనందంతో స్నేహితులు, బంధువులు, ప్రముఖులకు భారీ ఎత్తున విందు ఇచ్చాడు. కర్ణాటక సరిహద్దులోని ఆలూరు పట్టణంలో మూడు నెలల ిందట చోటుచేసుకున్న ఈ సంఘటనతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసులు కూడా రిటైర్డ్ అధికారిని ఆదర్శంగా తీసుకుని డబ్బుపై మోజుతో మట్కా ఆడేస్తున్నారు.
ఆలూరు పట్టణంతో పాటు హాలహర్వి, చిప్పగిరి, హోళగుంద మండలాల్లో పనిచేసే పోలీస్ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు, చిన్నచిన్న పనులు చేసుకుని బతికే ప్రజలు జోరుగా మట్కా ఆడుతున్నారు. గతంలో నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన మట్కా ప్రస్తుతం గ్రామాల్లో సైతం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఈ మాయా జూదంలో పేదలు మరింతగా నష్టపోతున్నారు. డబ్బుపై ఆశ మాయా జూదంలో చిక్కుకుపోయేలా చేస్తోంది.
ఇళ్లను గుళ్ల పోలీసుల అంచనా ప్రకారం ప్రతి రోజు రూ.రెండు కోట్లపైనే చేతులు మారుతున్నాయి. జిల్లాలో రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా మట్కా కంపెనీలు నడుస్తున్నాయి. వందల సంఖ్యలో నిర్వాహకులు పని చేస్తున్నట్లు పోలీసులకు కూడా సమాచారం ఉంది. మట్కా నియంత్రణ కోసం నిఘా తీవ్రతరం చేశామని పోలీసులు ప్రకటిస్తున్నప్పటికీ తెరచాటున వ్యవహారం గుట్టుగా నడుస్తోంది. ప్రతిరోజు డే మిలన్, రతన్, మిలన్ నంబర్లు విడుదల చేస్తూ వ్యాపారాన్ని భారీగా నడిపిస్తున్నారు.
మట్కా ఇలా సాగుతుంది...
ఫోన్లో కోడ్ నంబర్తో మాట్లాడితే చాలు బీటర్లు నంబర్లను తీసుకుంటారు. ఈ మేరకు ఫోన్కు కూడా మెసేజ్లు వస్తాయి. జిల్లాలో ఇలా ఫోన్ల ద్వారా మట్కా నంబర్లు బుక్ చేసుకునే వ్యవహారం జోరుగా నడుస్తోంది. మట్కా మాయ అంతా ఆన్లైన్లోనే నడుస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల ద్వారా చెల్లింపులు చేస్తూ ఎక్కడా పట్టుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ముంబయి నుంచి వచ్చే నంబర్ల ఆధారంగా చెల్లింపులు చేస్తున్నారు. జిల్లాలోని మట్కా నిర్వాహకులకు తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, బళ్లారి, బెంగళూరు కేంద్రాల్లోని నిర్వాహకులతో ఉన్న సంబంధాలతో వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. డే మిలన్ సాయంత్రం మూడు గంటలకు ప్రారంభ నంబరు(ఓపన్), అర్ధరాత్రి 12 గంటలకు ముగింపు నంబర్(క్లోజ్) విడుదల చేస్తారు. ఇలా వచ్చే నంబర్లకు 70 రెట్లు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్లైన్లో వివరాలు...
మట్కా నంబర్ తెలుసుకోవడానికి గతంలో నిర్వాహకులు లేదా బీటర్లను ఆశ్రయించేవారు. ప్రస్తుతం ఫోన్లకు సమాచారం పంపుతున్నారు. మట్కా నిర్వాహకులు ఆన్లైన్ సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. డబ్బు చెల్లించే నంబర్ ప్రతి రోజు ముంబయి నుంచి ఆన్లైన్లో వస్తుంది. మట్కాడాన్గా సీమలోనే పేరు మోసిన బుధవారపేట వాసి, పాతబస్తీ బ్రదర్స్ జిల్లా కేంద్రంతో పాటు గ్రామాలను విభజించి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
కర్నూలు, కోడుమూరు, ఆదోని, బనగానపల్లె, మంత్రాలయం, కోవెలకుంట్ల ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా మట్కా కొనసాగుతోంది. ఆదోని, కౌతాళం, పెద్దహరివాణం, మంత్రాలయం, ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి, హోళగుంద ప్రాంతాల వాసులు బళ్లారి, సిరుగుప్ప కేంద్రాలుగా మట్కాను నిర్వహిస్తుండగా బనగానపల్లె, కోవెలకుంట్ల ప్రాంతాల వాసులు తాడిపత్రి, గుత్తి కేంద్రాలుగా వ్యాపారాన్ని కొనసాగిస్తుండగా కోడుమూరు ప్రాంత వాసులు గుంతకల్ కేంద్రాలుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నంద్యాల, కర్నూలు, ఆదోని కేంద్రాలుగా కంపెనీలు నడుస్తున్నాయి.
ఆయా కేంద్రాలకు అనుబంధంగా పనిచేస్తున్న బీటర్లు ముందుగానే పెద్ద మొత్తంలో డిపాజిట్ చెల్లించి ఆ మొత్తం పూర్తయ్యే వరకు సెల్ఫోన్ల ద్వారానే వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నారు. కోడుమూరు, వెల్దుర్తి, బేతంచెర్ల ప్రాంతాల్లో మహిళలు కూడా బీటర్లుగా పని చేస్తున్నారు. డోన్, కోవెలకుంట్ల, కోడుమూరు ప్రాంతాల్లోని గ్రామాలకు కూడా ఈ వ్యాపారం విస్తరించింది. డోన్ పట్టణంతో పాటు ఓబులాపురం, గోసానపల్లె, జగదుర్తి, ఉడుమలపాడు, వెంకటనాయనిపల్లె, వేపదిన్నె, ప్యాపిలి, బేతంచెర్ల, వెల్దుర్తి, కోడుమూరు మండలంలో లద్దగిరి, గోరంట్ల, అల్లినగరం, బనగానపల్లె ప్రాంతంలోని పలుకూరు, యనకండ్ల, రామక్రిష్ణాపురం, కోవెలకుంట్ల ప్రాంతంలోని ముదిగేడు ప్రాంతాల్లో మట్కా జోరుగా కొనసాగుతోంది.
అడపాదడపా కేసులు..
ఉన్నతాధికారులు గట్టిగా ఆదేశించినప్పుడు తామూ విధులు నిర్వహిస్తున్నామన్నట్లు పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ మట్కా నిర్వాహకుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు దొరికినప్పటికీ వాటిని స్వాధీనం చేసుకుని తక్కువ మొత్తంలో చూపించి కేసులు బనాయిస్తున్నారు. దీంతో నిర్వాహకులు కూడా పోగొట్టుకున్న డబ్బును మళ్లీ సంపాదించుకునేందుకు మట్కా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
కర్నూలు, నంద్యాల, ఆదోని పట్టణాల్లో పోలీసు దాడులు జరుగుతాయన్న సమాచారం ముందస్తుగానే నిర్వాహకులకు చేరుతోంది. పోలీస్ శాఖలో కిందిస్థాయి సిబ్బందికి నెలవారీ మామూళ్లు చేరుతున్నాయి. దీంతో వారు దాడులకు సంబంధించి ముందస్తు సమాచారం అందుకుని మట్కా వ్యాపారులను అప్రమత్తం చేస్తున్నారు.
మామూళ్ల మత్తులో ఖాకీలు
కల్లూరు రూరల్: కల్లూరు మండల పరిధిలోని గ్రామాల్లో మట్కా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా నడుస్తుంది. రోజుకు లక్షల్లో మట్కా వ్యాపారం నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఒక్క రూపాయికి 100 రూపాయలు వస్తాయనే అత్యాశతో అమాయక ప్రజలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఉలిందకొండలో ఒక వృద్ధుడు, పెద్దటేకూరులో ఒక యువకుడు వెనక ఉండి వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు.
ఆ ఇద్దరు వ్యక్తులు వారి కింద పనిచేసే వ్యక్తులకు రోజుకు రూ.500 నుంచి రూ.1000 ఇచ్చి మట్కా రాయిస్తున్నారు. వీరి వ్యాపారానికి అడ్డుపడకుండా పోలీసులకు నెలకు రూ.30 వేలు ఇస్తున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఉలిందకొండ, చిన్నటేకూరు, పెద్దటేకూరు, ముజఫర్నగర్, కృష్ణానగర్, కల్లూరు ప్రాంతాలలో ఏజెంట్లను నియమించి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు.
మట్కా వల్ల చాలా గ్రామాల్లోని జనం రోడ్ల మీద పడుతున్నా పోలీసులలో చలనం కలగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మట్కాలో రతన్ అనే క్రీడ 6 రోజులు, మిలాన్ అనే క్రీడ 5 రోజులు ఆడుతూ వీటితో పాటు కొత్తగా మరికొన్ని ఆటలను రంగంలోకి దించారు.