మాట్కా.. మామూల్లే! | Matka managers from mamullu | Sakshi
Sakshi News home page

మాట్కా.. మామూల్లే!

Apr 12 2016 3:46 AM | Updated on Oct 16 2018 2:30 PM

మాట్కా.. మామూల్లే! - Sakshi

మాట్కా.. మామూల్లే!

అనంత’లో మట్కా జాఢ్యం జడలు విప్పుతోంది. నగరంలో కొంతకాలంగా తగ్గినట్లు కనిపించినా..

మట్కా రాయుళ్లకు పోలీసుల అండ
నిర్వాహకుల నుంచి మామూళ్లు
గుట్టు విప్పిన అదుపులోని నిందితులు

మట్కా మహమ్మారి ఎన్నో కుటుంబాలను వీధినపడేస్తోంది. ఈ వ్యసనానికి బానిసై అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న వారూ ఉన్నారు. రూపాయికి రూ.80 తగులుతుందని ఆశ పెడుతూ పేద, మధ్య తరగతి ప్రజలను మట్కా ఊబిలోకిలాగుతున్నారు. వారు రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును సాయంత్రం మట్కాకు తగలేస్తున్నారు. ఈ మహమ్మారిని నివారించాల్సిన పోలీసు శాఖ మీనమేషాలు లెక్కిస్తోందనే విమర్శలున్నాయి.
 
అనంతపురం : అనంత’లో మట్కా జాఢ్యం జడలు విప్పుతోంది. నగరంలో కొంతకాలంగా తగ్గినట్లు కనిపించినా.. ఇటీవల చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొందరు నిర్వాహకులకు పోలీసులే అండగా నిలుస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవల వెలుగు చూసిన ఓ ఉదంతమే ఇందుకు నిదర్శనం. 15 రోజుల కిందట మట్కా నిర్వాహకుడు షబ్బీర్‌ను ప్రత్యేక పోలీసులు నగరశివారులోని పిల్లిగుండ్లకాలనీలో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా అనుచరులుగా ఉన్న వేణుగోపాల్‌నగర్, నీరుగంటివీధి తదితర ప్రాంతాలకు చెందిన మరో ఐదుగురి పేర్లు చెప్పాడు.

వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏడు కంపెనీల ద్వారా 13 మంది మట్కా నిర్వహిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం. ఇదే తరుణంలో తమకు సహకరిస్తున్న పోలీసుల చిట్టా కూడా విప్పారు. నగరంలోని ఒక స్టేషన్‌లో పని చేస్తున్న సుమారు 10 మంది గ్రేడ్-1 పోలీసులు, 15 మంది సాధారణ పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నారంటూ వారి పేర్లు సహా బయట పెట్టినట్లు సమాచారం. ఒక్కొక్కరు ప్రతివారం రూ. వెయ్యి నుంచి రూ.2 వేల తీసుకుంటున్నట్లు ప్రత్యేక పోలీసుల విచారణలో వెల్లడించినట్లు  తెలిసింది. విచారణ అనంతరం ప్రత్యేక పోలీసులు తమ అదుపులో ఉన్న మట్కా నిర్వాహకులను ఓ స్టేషన్‌కు అప్పగించారు. వారు కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ రాఘవన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ...మట్కా నిర్వాహకుడు షబ్బీర్‌ను ఇటీవలే అరెస్టు చేశామన్నారు.    


 ఎస్పీ దృష్టికి పోలీసుల నిర్వాకం!
 మట్కా నిర్వాహకులకు అండగా నిలుస్తున్న పోలీసుల వివరాలు ఎస్పీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. మట్కా నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరించాలనిపదేపదే చెబుతున్నా.. కొందరి తీరు మారకపోవడం వెనుక కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఏయే స్టేషన్లలో ఎంతమంది పోలీసులు మట్కా నిర్వాహకులతో టచ్‌లో ఉన్నారనే సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. త్వరలో సాధారణ బదిలీలున్న నేపథ్యంలో వారిని దూరప్రాంతాలకు బదిలీ చేస్తారనే ప్రచారం పోలీసు వర్గాల్లో సాగుతోంది.
 
మట్కా నిర్వాహకుల అరెస్ట్
అనంతపురం  పాతూరులోని నీలం కాంప్లెక్స్ సమీపంలో మట్కా రాస్తున్న ముగ్గురు వ్యక్తులను సోమవారం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం ఎస్‌ఐ వెంకటరమణ సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు.  నీలం బాషా, మోహన్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2,200 నగదు, చీటీలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement