తల్లిదండ్రుల చెంత గారాబంగా పెరగాల్సిన ఓ యువతి అనుమానాస్పద స్థితి లో విగతజీవిగా కనిపించింది. ప్రేమ వ్యవహారమే
ప్రేమ వ్యవహారమే..ప్రాణం తీసిందా?
Nov 11 2013 3:19 AM | Updated on Sep 2 2017 12:30 AM
పెదనడిపల్లి (చీపురుపల్లి రూరల్), న్యూస్లైన్: తల్లిదండ్రుల చెంత గారాబంగా పెరగాల్సిన ఓ యువతి అనుమానాస్పద స్థితి లో విగతజీవిగా కనిపించింది. ప్రేమ వ్యవహారమే ఆ యువతి ప్రాణం తీసి ఉంటుం దని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీపురుపల్లి మండలం పెదనడిపల్లి గ్రామానికి చెందిన యువతి గండమాన చినమల్లి(18) గ్రామ సమీపంలోని ఒక గనిబంటాలో అనుమానాస్పదస్థితిలో ఆదివారం శవమై తేలింది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాల మేరకు..గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెం దిన చినమల్లి రెండు రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయింది. రెండు రోజులుగా కూతురు కనిపించకపోవడంతో తండ్రి చిన్నయ్య వెతకడం ప్రారంభించాడు.
గామంలో తమకు తెలిసిన వారిని, సమీప పంటపొలాల్లో బంధువుల ఇళ్లలో వెతకసాగాడు. అయినప్పటికీ కూతురి ఆచూకీ తెలియరాలేదు. ఈ విధంగా వెతుకుతుండగా ఆదివారం ఉదయం 6గంటల సమీపంలో గని బంటాలో కుమార్తె మృతదేహం తేలిఉంది. ఈ విషయంపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో చీపురుపల్లి ఎస్ఐ షేక్అబ్దుల్మరూఫ్, ఏఎస్ఐ పాపారావు,ఆర్ఐ హైమావతిలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన ఒక నాయకుడి కుమారుడితో చినమల్లికి ప్రేమవ్యవహారం ఉన్నట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కూతురు ఎంత వెదికినా దొరకలేదని చివరకు గనిబంటాలో శవమై తేలిందని మృతురాలి తండ్రి రోదిస్తున్నాడు. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి చిన్నయ్య తన కూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement