పెళ్లైన 2 నెలలకే.. నవవధువు అనుమానాస్పద మృతి! | Delhi Woman Hosts Office Party, Found Dead Hours Later | Sakshi
Sakshi News home page

పెళ్లైన 2 నెలలకే.. నవవధువు అనుమానాస్పద మృతి!

Jul 6 2026 7:59 AM | Updated on Jul 6 2026 8:49 AM

Delhi Woman Hosts Office Party, Found Dead Hours Later

న్యూఢిల్లీ: కొత్త పెళ్లి ముచ్చట్లు తీరకముందే.. ఎనిమిదేళ్ల ప్రేమ బంధం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి నవ్వుతూ పార్టీ చేసుకున్న కొన్ని గంటల్లోనే, ఆ నూతన వధువు రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఢిల్లీలో కలకలం రేపిన ఆకృతి సుతార్ అనుమానాస్పద మృతి వెనుక.. రూ. 20 లక్షల అదనపు కట్న వేధింపులు ఉన్నాయంటూ ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు

పెళ్లైన రెండు నెలలకే ఆకృతి సుతార్ (28) అనే వివాహిత ఢిల్లీలోని ఒక నివాస సముదాయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు.. ఇది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ కట్నం కోసం చేసిన హత్యేనని తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

ఛతర్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆకృతి, శనివారం ఉదయమే సెలవు ముగించుకుని తిరిగి విధుల్లో చేరింది. ఆఫీసులో తోటి ఉద్యోగులకు ఆమె ఒక చిన్న పార్టీ కూడా ఇచ్చింది. సాయంత్రం 6 గంటల సమయంలో తన తల్లితో ఫోన్‌లో మాట్లాడిన ఆకృతి.. ఆఫీస్ పార్టీ ముగించుకుని ఇంటికి బయలుదేరుతున్నట్లు చెప్పింది.

అయితే, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆకృతి భర్త అరస్తు సిక్కా ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆకృతి కనిపించడం లేదని తెలిపాడు. ఆ తర్వాత సుమారు గంటన్నరకే, లోధి కాలనీలోని పాలికా కుంజ్ నివాస సముదాయంలో ఒక మహిళ మృతదేహం పడి ఉందని పోలీసులు సమాచారం ఇచ్చారు. బిల్డింగ్ పైనుంచి కింద పడటం వల్లే ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఎనిమిదేళ్ల ప్రేమ తర్వాత గత ఏప్రిల్ 24న ఆకృతి..నిరుద్యోగి అరస్తు సిక్కాను వివాహం చేసుకుంది. పెళ్లయినప్పటి నుంచి భర్త, అత్తమామలు రూ.20 లక్షల అదనపు కట్నం కోసం ఆమెను తీవ్రంగా వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అరస్తు గతంలో పలుమార్లు ఆమెను చంపేస్తానని బెదిరించాడని, మరణానికి రెండు రోజుల ముందు కూడా వారి మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని ఆమె సోదరుడు అమయ్ సుతార్ తెలిపాడు. ఆకృతి మానసికంగా చాలా ధైర్యంగా ఉందని, ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కట్నం వేధింపులు, హత్య కోణాలతో పాటు అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement