అమలుకాని హామీలతో, మోసకారి మాటలతో, అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా రైతు బతికి...
గన్నవరం : అమలుకాని హామీలతో, మోసకారి మాటలతో, అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా రైతు బతికి బట్ట కట్టలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థపారథి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలను మాఫి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కనీసం రైతులకు అవసరమైన సాగునీటిని కూడా ఇవ్వలేని అధ్వాన పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. 2004లో సాగర్ప్రాజెక్టులో ఇప్పటికంటే తక్కువ నీటి మట్టం ఉన్నప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లి కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేయించారని గుర్తుచేశారు.
ఈ విషయంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణా ప్రభుత్వ వైఖరి కారణంగా హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణా ప్రభుత్వంతో చర్చలు జరిపి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే మన ప్రభుత్వమే హైదరాబాద్లోని విద్యార్థుల ఫీజులను భరించాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అధికార పార్టీ వే ధింపులను మానుకోవాలని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెల రోజుల్లో నెరవేర్చకపోతే రైతులతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ కొల్లి రాజశేఖర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆరుమాళ్ళ సాంబిరెడ్డి, పట్టణ, మండల కన్వీనర్లు సూరం విజయకుమార్, మేచినేని బాబు, పార్టీ నాయకులు నిడమర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పాలకపక్షం విఫలం...
కంకిపాడు : సమస్యలను పరిష్కరించడంలో పాలక పక్షం విఫలమైందని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?లేదా? అన్న అనుమానం కలుగుతుందని కొలుసు పార్థసారథి అన్నారు. మండలంలోని ఉప్పులూరు గ్రామం వచ్చిన ఆయన మాట్లా డుతూ కంకిపాడు రైతుబజారులో దుకాణ దారులను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు.దుకాణాల కేటాయింపుల పేరుతో అవస్థలకు గురిచేస్తే సహించేది లేదని మార్కెటింగ్ శాఖ జేడీకి ఫోన్లో సూచించారు.సీడీసీ చైర్మన్ నెరుసు సతీష్, ఉప్పులూరు గ్రామ ఉపసర్పంచి బందెల సుబ్బారావు, అన్నే చంటి, వేల్పూరు సర్పంచి చెన్నుబోయిన జయరాం పాల్గొన్నారు.