అజ్ఞాతం వీడిన ‘కల్కి’ వ్యవస్థాపకులు | Kalki Ashrams Founders Release Video | Sakshi
Sakshi News home page

అజ్ఞాతం వీడిన ‘కల్కి’ వ్యవస్థాపకులు

Oct 22 2019 10:04 AM | Updated on Oct 22 2019 10:33 AM

Kalki Ashrams Founders Release Video - Sakshi

సాక్షి, చిత్తూరు: కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే వారు అందుబాటులో ఉన్నారంటూ కల్కీ ఆశ్రమం మీడియాకు ఓ వీడియోను విడుదల చేసింది. తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ వీడియోలో విజయ్‌కుమార్‌ దంపతులు పేర్కొన్నారు. తాము దేశం విడిచి వెళ్లిపోయానని మీడియాలో కథనాలు వస్తున్నాయని, కానీ, తాము దేశం విడిచివెళ్లలేదని, వదంతులు నమ్మవద్దని వారు కోరారు. కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు.

భక్తి ముసుగులో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్కి ఆశ్రమంలో ఇటీవల జరిగిన ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నిత్యం వివాదాలకు కేంద్రంగా మారిన కల్కి ఆశ్రమంలో జరిగిన ఐటీ సోదాల్లో లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు వెలుగుచూసినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు హైదరాబాద్‌లోనూ కల్కి ఆస్తులపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో బంగారు బిస్కట్లు, ఆస్తులు, కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement