ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు.
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకులతో మాట్లాడారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు ఇవ్వజూపి అడ్డంగా దొరికిపోయినా కూడా చంద్రబాబుకు సిగ్గురాలేదన్నారు. తాజాగా ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్థానిక ప్రజా ప్రతినిధులను డబ్బుతో కొనుగోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీకి తగినంత బలం లేకపోయినా ఎమ్మెల్సీ అభ్యర్థులను పోటికి పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు.
వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు’ కేసును పక్కదారి పట్టించేందుకే సెక్షన్ 8 అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్షన్ 8పై ఢిల్లీలో ఆందోళన చేస్తామని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ అంశాలన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 28న విజయవాడలో 10 వామపక్ష పార్టీలతో సమావేశం కానున్నట్లు ప్రకటించారు.