నిరుద్యోగుల కోసమే జాబ్‌మేళా | Job mela a boon to the unemployed youth | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల కోసమే జాబ్‌మేళా

Oct 20 2013 12:37 AM | Updated on Sep 1 2017 11:47 PM

నిరుద్యోగులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి అన్నారు.

నర్సాపూర్, న్యూస్‌లైన్: నిరుద్యోగులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  సునీతారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆనంద్ గార్డెన్‌లో రాజీవ్ యువ కిరణాలు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఏడాదికి లక్ష ఉద్యోగాలు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 లక్షల 52 వేల మందికి ఉద్యోగాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 14 వేల మందికి లక్ష్యం కాగా ఇప్పటి వరకు 5 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు మంత్రి వివరించారు. చదువుకున్న వారికి ఆయా రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ సైతం ఇస్తున్నట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న కలెక్టర్ స్మితాసబర్వాల్ మాట్లాడుతూ నిరుద్యోగులు ఉద్యోగంలో చేరగానే జీతం ఎంత అని చూడొద్దని, సొంతంగా ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో ముందుకు సాగాలని హితవు పలికారు.
 
 కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ బాల్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, కాంగ్రెస్ నాయకులు సత్యంగౌడ్, కృష్ణారావు, వెంకటేష్‌గౌడ్, శ్రీనివాస్‌గుప్తా, అనిల్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, లలిత, మహిపాల్‌రెడ్డి, గోమారం చంద్రాగౌడ్ ఐకేపీ ఇన్‌చార్జ్ ఏపీఓ బాబురావు, ఏపీఎం సత్యనారాయణ, ఇతర సిబ్బంది, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. జాబ్‌మేళాలో పాల్గొని, ఆయా కంపెనీలు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ కౌంటర్లును మంత్రి, కలెక్టర్ పరిశీలించారు. కాగా జాబ్‌మేళాలో 2,039 మంది నిరుద్యోగులు పాల్గొనగా 1,223 మంది ఎంపికైనట్లు ఐకేపీ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement