న్యూఢిల్లీ: నిరుద్యోగ యువత బొద్దింకల్లా సమాజాన్ని పాడుచేస్తోందన్న విమర్శలతో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విదేశాల నుంచి భారత్కు తిరిగొస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీ, సీబీఎస్ఈ ఉదంతం, క్యూట్–యూజీ పరీక్ష ఆలస్యం ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాచేయాలంటూ తాను జూన్ ఆరోతేదీన ఢిల్లీలో శాంతియుత ధర్నా చేపట్టనున్నట్లు దీప్కే ప్రకటించారు.
ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’, ఇన్స్టా గ్రామ్లో ఒక వీడియోను విడుదలచేశారు. ‘‘మనందరం ఒక్కతాటి మీదకొచ్చి శాంతియుత నిరసన ప్రదర్శన చేయాల్సిన సమయం వచ్చింది. రాజ్యాంగబద్ధ మార్గంలో పయనిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని శాంతియుతంగా మన నిరసన వాణిని వినిపిద్దాం. మనందరం ఒక్కటిగా గొంతుకను వినిపిస్తే మన వాదనలతో వాళ్లు కూడా ఏకీభవిస్తారు. జూన్ ఆరోతేదీన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం.
శనివారం సాయంత్రం ఢిల్లీకి రాగానే మనందరం కలిసి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్స్టేషన్కు వెళ్దాం. శాంతియుత ర్యాలీకి అనుమతికోరదాం. పరీక్షల సంబంధల వివాదాలతో లక్షలాది మంది పరీక్షార్థులు ఎంతో మనోవేదనను అనుభవిస్తున్నారు. దీనికి ప్రభుత్వం, నేతలు జవాబుదారీగా ఉండాల్సిందే’’అని దీప్కే అన్నారు. ‘‘మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాచేయాలంటూ మొదలైన ఆన్లైన్ సంతకాల ఉద్యమంలో ఇప్పటికే లక్షలాది మంది సంతకాలు పంపించారు.
ఉత్తరప్రదేశ్ మొదలు రాజస్థాన్, మహారాష్ట్రదాకా విద్యాసంబంధ నిరసనకార్యక్రమాలు ఇప్పటికే జోరందుకున్నాయి’’అని దీప్కే గుర్తుచేశారు. ‘‘ఇటీవలి కాలంలో వివాదాలకు నిలయంగా మారిన పలు పరీక్షల కారణంగా దాదాపు కోటి మంది పరీక్షార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. ఇంతజరిగినా మంత్రి ప్రధాన్ రాజీనామాచేయట్లేదంటూ దేశంలో జవాబుదారీతనమే లేదని స్పష్టమవుతోంది.
కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం, వివాదంతో నేను ఢిల్లీలో అడుగుపెట్టగానే అరెస్ట్చేస్తారని నా కుటుంబసభ్యులు, బంధువులు, స్నహితులు చెబుతున్నారు. నాకు మద్దతిచ్చే వారంతా ఎయిర్పోర్ట్కు వచ్చి మనలోని ఐక్యతను చాటండి’’అని దీప్కే పిలుపునిచ్చారు. ‘‘ఇప్పటికీ మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని నమ్ముతున్నా. మన ర్యాలీకి అనుమతి వస్తుందని ఆశిస్తున్నా.
మహాత్మాగాం«దీజీ, బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ అంటే నాకు అమితమైన భక్తి. అందరికంటే నాకు రాజ్యాంగంపై విశ్వాసం ఎక్కువ. జైలుశిక్ష భయంతో ఎన్నాడూ భయపడుతూ బతకగలం? శాంతియుతర్యాలీలను ప్రోత్సహించే రాజ్యాంగానికి బద్దులైన బొద్దింకలన్నీ ఏకమై కోట్లాది మంది విద్యార్థుల భవితను కాపాడాలి’’అని దీప్కే వ్యాఖ్యానించారు.


