స్పోర్ట్స్ కోటా డీఎస్సీలో వెలుగులోకి రోజుకో వింత
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మొండిచెయ్యి
కేవలం జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన వారికి పోస్టులు
పబ్లిక్ డొమైన్లో ప్రదర్శించకుండా అత్యంత గుట్టుగా తుది జాబితా
పొరుగు రాష్ట్రాల్లో డిగ్రీలు చదివిన వారి సర్టిఫికెట్లపై అనుమానాలు
ఫేక్ క్రీడా సర్టిఫికెట్లు, డిగ్రీలు సృష్టించి ఉద్యోగాలు అమ్మేశారంటూ అర్హుల ఆరోపణ
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా క్రీడా కోటాలో రాత పరీక్ష అవసరం లేకుండా భర్తీ చేసిన టీచర్ పోస్టుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అత్యంత దారుణంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ (అంతర్ జిల్లా) క్రీడా పోటీల సర్టీ ఫికెట్లతో ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టేయడం విస్తుగొల్పుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు మొండిచెయ్యి చూపించి కేవలం ఒక జిల్లాకు క్రీడల్లో ప్రాతినిథ్యం వహించిన వారి సర్టీ ఫికెట్లకు ప్రాధాన్యం ఇవ్వడం డీఎస్సీ క్రీడా కోటా పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతరగా నిలుస్తోంది. ‘ముఖ్య’నేత బంధువు, మాస్టర్ మైండ్ అవినీతి వ్యూహంలో భాగంగానే పోస్టుల భర్తీలో ప్రాధాన్యతలు మారిపోయినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు.
మెరిట్ జాబితా ఎక్కడ?
క్రీడా కోటా డీఎస్సీలో 421 పోస్టుల్లో 97 శాతం భర్తీ చేశారు. అయితే ఎక్కడా మెరిట్ జాబితాను ప్రదర్శించలేదు. తొలుత టెంటేటివ్ (తాత్కాలిక) జాబితాను పెట్టిన శాప్ దానిపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో వెంటనే తొలగించింది. ఆ తర్వాత తుది జాబితాను ఎక్కడా ప్రదర్శించకుండా కొందరు అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం చేరవేసింది. విచిత్రం ఏమిటంటే.. తాత్కాలిక జాబితాలో ఉన్న చాలా మంది అభ్యర్థుల పేర్లు తుది జాబితాలో లేకపోవడం.
అంతా పారదర్శకంగా చేశామని, పబ్లిక్ డొమైన్లో ప్రతి డేటాను అందుబాటులో ఉంచామని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రకటించారు. అయితే శాప్ వెబ్సైట్ మొత్తం జల్లెడ పట్టినా ఎక్కడా ఎంపికైన ఒక్క అభ్యర్థి వివరాలు కానరాలేదు. శాప్కు వచి్చన దరఖాస్తులను తొలుత స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి జాబితాను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపగా సమీక్షించి తుది జాబితాను ఆమోదించింది. ఇదంతా లోపాయికారిగా చేయడంలో మాస్టర్మైండ్ కీలక చక్రం తిప్పినట్టు తెలుస్తోంది!
బ్యాక్గ్రౌండ్ జల్లెడ పడుతున్న అభ్యర్థులు..
క్రీడా కోటా డీఎస్సీలో అవినీతి బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు ‘మాస్టర్మైండ్’ ఉద్యోగాలు పొందిన కొందరు ఉపాధ్యాయులను రంగంలోకి దించి వీడియోలతో ప్రజల దృష్టిని దారి మళ్లించేందుకు చేసిన యత్నం బెడిసికొడుతోంది. వారి బ్యాక్ గ్రౌండ్ను నిరుద్యోగ అభ్యర్థులు జల్లెడ పడుతున్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం దక్కని క్రీడాకారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీంతో వీడియోలు చేస్తే తమ గుట్టు రట్టవుతుందని ఫేక్ సర్టీ ఫికెట్లతో ఉద్యోగం పొందిన వారు బెంబేలెత్తుతున్నారు. ఇదిలా ఉంటే డీఎస్సీ గురించి చిన్న పేపర్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదంటూ తమపై మాస్టర్మైండ్ విరుచుకుపడటాన్ని శాప్ వర్గాలు జీరి్ణంచుకోలేకపోతున్నాయి. మూటలు దోచుకుని తమపై చిందులేయడం ఏమిటని చర్చించుకుంటున్నాయి.
సర్టీ ఫికెట్ల పరిశీలన ఏది?
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ క్రీడాకారిణి ఖోఖోలో జాతీయ స్థాయిలో రాణించారు. ఆమెకు డిగ్రీ సర్టీ ఫికెట్ లేకున్నా స్పోర్ట్స్ కోటా డీఎస్సీలో ఉద్యోగం వచ్చింది. తొలుత జిల్లా జాబితాలో 10వ స్థానంలో ఉన్న ఆమె తర్వాత టాప్లోకి వచ్చేసింది. పొరుగు రాష్ట్రంలో డిగ్రీ చదివినట్లు ఓ ఫేక్ సర్టీ ఫికెట్ను సృష్టించి పోస్టు అమ్మేశారు.
అదే శాప్.. క్రీడా సర్టీ ఫికెట్తోపాటు అభ్యర్థి డిగ్రీ సర్టీ ఫికెట్ నిజమైనదేనా? అని పరిశీలించి ఉంటే అక్రమాలు జరిగేవి కావని అవకాశం కోల్పోయిన అర్హులైన అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో బీపీఈడీ, బీఈడీలు చేసినట్లు బోగస్ సర్టీ ఫికెట్లతో ఉద్యోగాలిచ్చారని, ఒక్క అభ్యర్థి విషయంలో కూడా శాప్ ఆయా వర్సిటీలకు వివరాలను పంపించి వాస్తవాన్ని ధ్రువీకరించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా సర్టీ ఫికెట్లే కాదు.. దొంగ డిగ్రీలతోనూ టీచర్ ఉద్యోగాలు అమ్మేయడం ‘మాస్టర్మైండ్’ స్కెచ్కు నిదర్శనమని పేర్కొంటున్నారు.
సర్టిఫికెట్కు రూ.5 లక్షలు.. పోస్టుకు రూ.15–20 లక్షలు!
క్రీడా కోటా డీఎస్సీలో ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి టీచర్ ఉద్యోగాలను అంగట్లో సరుకుల మాదిరిగా అమ్మేశారని తొలి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.5 లక్షలకు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్లను విక్రయించడంతో పాటు పోస్టుకు రూ.15–20 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇలా మూడొంతులు పోస్టులు అమ్ముకుని రూ.40–50 కోట్లు వసూలు చేసినట్లు క్రీడాకారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అందుకే ఎక్కడా తుది మెరిట్ లిస్టును ప్రదర్శించ లేదని.. దొడ్డి దారిన ఉద్యోగాలు పొందిన వారి గుట్టు, మాస్టర్మైండ్ బండారం బయటపడుతుందనే భయంతోనే దాన్ని దాచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


