తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు | Huge Betting On The Result Of Telangana Assembly Elections 2018 | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు

Dec 9 2018 9:29 AM | Updated on Dec 9 2018 9:46 AM

Huge Betting On The Result Of Telangana Assembly Elections 2018 - Sakshi

టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కేటీఆర్, హరీష్‌రావు,  వచ్చే మెజార్టీపై బెట్టింగ్‌

కోవెలకుంట్ల: పక్క రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఆయా పార్టీల గెలుపోటములపై బెట్టింగ్‌ల జోరు సాగుతోంది. కోవెలకుంట్ల కేంద్రంగా పోలింగ్‌ ముగిసినప్పటి నుంచి పందేలా జోరు ఊపందుకుంది. శుక్రవారం ఎన్నికల పోలింగ్‌ ముగియగా ఈ నెల 11న ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. కౌంటింగ్‌కు మరో రెండు రోజులు గడువు ఉండటంతో ప్రధాన పార్టీల గెలుపుపై బెట్టింగ్‌ రాయుళ్లు రూ. లక్షల్లో పందెం కాస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ఆ పార్టీ తరఫున పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు రూ.5 లక్షల వరకు బెట్‌ కట్టగా, మరికొంత మంది మహాకూటమి విజయం సాధిస్తుందని వారికి ధీటుగా బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

పట్టణంలో పలుచోట్ల తెలంగాణా ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతుండగా మరోవైపు బెట్టింగ్‌ వ్యవహారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల  గెలుపుతోపాటు ఆయా పార్టీల్లో బలమైన అభ్యర్థుల గెలుపు, మెజార్టీపై పందేలు కాశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన కేటీఆర్, హరీష్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి వంటి ప్రధాన నాయకులకు ఎన్నికల్లో వచ్చే మెజార్టీపై బెట్టింగ్‌లు కడుతున్నట్లు సమాచారం. రూ.5వేల నుంచి రూ.లక్షల్లో పార్టీల గెలుపు, ఓటములపై పందేలు సాగుతున్నాయి. హైదరాబాదులో ఉన్న స్నేహితులు, తెలిసిన వ్యక్తుల నుంచి ఫోన్ల ద్వారా ఎన్నికల సమాచారం రాబట్టుకోవడంతోపాటు పలు చానళ్లు, పత్రికల్లో వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఆధారంగా ఆయా పార్టీల గెలుపు, ఓటములపై బెట్టింగ్‌లు నిర్వహిస్తుండటం గమనార్హం. పట్టణంతోపాటు డివిజన్‌లోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బెట్టింగ్‌ల్లో పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement