నిలిచిపోయిన జీమెయిల్; అనుమానాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో సోమవారం జీమెయిల్ నిలిచిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జీమెయిల్ పనిచేయకపోవడంతో సమాచార మార్పిడి నిలిచిపోయింది. ఫలితంగా ప్రభుత్వ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెక్రటేరియట్ నెట్వర్క్ ఐపీలో బ్లాక్ చేయడం వల్లే జీమెయిల్ ఆగిపోయిందని ఉద్యోగ వర్గాలు వెల్లడించాయి.
జీమెయిల్ పనిచెయ్యకపోవడంపై ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలన్నీ జీమెయిల్ ద్వారానే అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా జీమెయిల్ నిలిపివేయడంపై అనుమానాలు రేగుతున్నాయి. జీమెయిల్ను కావాలనే నిలిపివేశారా, మరేదైనా కారణం ఉందా అనే దానిపై వెంటనే స్పష్టత రాలేదు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించాల్సివుంది.