అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. పంట చేతికొచ్చే దశలో ప్రకృతి పగబట్టి నోటికాడి బుక్క నేలపాలు చేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు నేలవాలుతున్నాయి.
అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. పంట చేతికొచ్చే దశలో ప్రకృతి పగబట్టి నోటికాడి బుక్క నేలపాలు చేస్తోంది. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు నేలవాలుతున్నాయి. వేలాది హెక్టార్లలో వరి, పత్తి పంటలు నేలకొరిగాయి . మరో నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచనలుండడంతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. పంట చేలల్లో నీరు చేరి నాణ్యత దెబ్బతినే ప్రమాదముంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 5.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సాయంత్రం భారీ వర్షం కురిసింది.
కలెక్టరేట్, న్యూస్లైన్ :జిల్లాలో 1.75 లక్షల హెక్టార్లలో వరి, 2.60 లక్షల హెక్టార్లలో పత్తి, 60 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయగా, లక్ష హెక్టార్ల మేర ఆరుతడి పంటలు సాగు చేశారు. 60 శాతం మేర వరి పంట కోతకు వచ్చింది. మొదటి దఫా ఏరిన పత్తి మార్కెట్లో విక్రయానికి వస్తోంది.
అకాల వర్షాలు ఇటు కోతలకు... అటు కోసిన పంటలకు ఆటంకం కలిగిస్తున్నాయి. చేతికొచ్చే దశలో వర్షం కురుస్తుండడంతో నష్టం భారీగా జరిగే అవకాశముండగా అధికారులు అంచనా వేయాల్సి ఉంది. మార్కెట్యార్డుల్లో కొనుగోళ్లు ప్రారంభించగా... రైతుల పంట ఉత్పత్తులు తడిసి ముద్దవుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలతో జమ్మికుంట, కరీంనగర్, హుస్నాబాద్, జగిత్యాల తదితర మార్కెట్యార్డుల్లో ధాన్యం, పత్తి తడిసి ముద్దయ్యాయి. టార్పాలిన్లు అందుబాటులో లేక రైతులు నష్టపోయారు. తేమసాకుతో వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్యార్డులోన్లే రోజుల తరబడి ధాన్యం ఆరబెడుతున్నారు. బుధవారం అకస్మాత్తుగా వర్షం పడడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
కరీంనగర్ మార్కెట్లో వ్యాపారులు బుధవారం మధ్యాహ్నం వరకు కూడా కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అప్పటికే మంగళవారం ధాన్యం తడిసిందన్న ఆవేదనలో ఉన్న రైతులు మార్కెటింగ్ ఏడీ పద్మావతి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్రెడ్డితోపాటు అధికారులను నిలదీశారు.
వారు రైతులను ఓదార్చేందుకు ప్రయత్నించగా, రైతులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. దీంతో అడ్తీదారులు, వ్యాపారులను ఆగమేఘాలమీద పిలిచి కొనుగోలు చేయిం చారు. నిల్వ ఉన్న ధాన్యం 931 క్వింటాళ్లను రూ.1250 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. 582 క్వింటాళ్ల మక్కలు రాగా రూ.1050 నుంచి రూ.1,260 వరకు ధర చెల్లించారు. పత్తి 1271 క్వింటాళ్లు రాగా రూ.3,750 నుంచి రూ.4,400 వరకు కొనుగోలు చేశారు. తేమ సాకును కంటి చూపుతోనే చెప్పి క్వింటాల్కు రూ.100 నుంచి రూ.150 వరకు కోత పెట్టారు. ఓ వైపు మబ్బులు, మరో వైపు వర్షం... తప్పని పరిస్థితుల్లో రైతులు విక్రయించుకోక తప్పలేదు.
రేపటి నుంచి మార్కెట్ బంద్
భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని వ్యవసాయ మార్కెట్యార్డులకు ఆయా ఏఎంసీ చైర్మన్లు మూడు రోజుల పాటు బంద్ ప్రకటించారు. 24 నుంచి 26 వరకు ధాన్యం, మక్కలు తీసుకురావద్దని కోరారు. శని, ఆదివారాలు మార్కెట్యార్డుకు సెలవు కావడంతో వర్షాలు తగ్గుముఖం పడితే తిరిగి కొనుగోళ్లు ప్రారంభిస్తామని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకారపు భాస్కర్రెడ్డి తెలిపారు.
జాడలేరు.. పత్తలేరు
-కాదాసి పర్శరాం, కమాన్పూర్, -ఆర్.చంద్రయ్య, రేణిగుంట
-ఎన్.రాఘవరెడ్డి, గట్టుబూత్కూర్
ఒక్కొక్కలం 20 నుంచి 60 బస్తాల వరకు వడ్లు తెచ్చినం.. వచ్చి రెండు రోజులైతంది. ఇళ్లు, పని ఇడిసిపెట్టి వడ్లకాన్నే కావలుంటున్నం. అడ్తీదారులు జాడలేరు పత్తలేరు. పచ్చిగున్నయని కుప్పలకాడికి రానేలేదు. ఇక్కడ్నే ఆరబెట్టుకున్నం. రాత్రి ఒక్కసారిగా వర్షం వచ్చింది. ఏం చేయాలో తోచలేదు. యార్డులో తక్కువ వడ్లు వచ్చినా ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోతే అధికారులు ఏం చేస్తున్నట్లు? వడ్లు తడిసి 10-15 క్వింటాళ్ల దాక తరుగుపోయినట్లే. మళ్లీ మబ్బులు రావట్టే.