మాజీ మావోయిస్టు నందు మృతి | Former Maoist killed | Sakshi
Sakshi News home page

మాజీ మావోయిస్టు నందు మృతి

Jun 22 2018 2:36 AM | Updated on Mar 28 2019 5:07 PM

Former Maoist killed - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖ పట్నం /పాత పోస్టాఫీసు (విశాఖ దక్షిణ): మాజీ మావోయిస్టు, ఆంధ్ర– ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ) లో ఒకప్పటి కీలక నాయకుడైన పొన్నోజు పరమేశ్వరరావు (49) అలియాస్‌ విశ్వనాథ్‌ అలియాస్‌ పాపన్న అలి యాస్‌ నందు గురువారం విశాఖలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి(కేజీహెచ్‌)లో మృతి చెందాడు.

2011లో పోలీసుల ఎదుట లొంగిపోయిన నందు విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం చింతపల్లిలో వ్యవ సాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళ వారం తీవ్ర అస్వస్థతకు గురైన నందును కుటుంబసభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఆయన మృతి చెందాడు. సాయంత్రం పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య స్వరూప, ఓ కుమార్తె ఉన్నారు.  

ఆర్‌ఈసీ నుంచి ఉద్యమంలోకి..
హన్మకొండ సమీపంలోని హసన్‌వర్తికి చెందిన నందు వరంగల్‌ రీజనల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌(ఆర్‌ఈసీ) నాయకుడిగా విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో నక్సలైట్‌ ఉద్యమం వైపు ఆకర్షితుడైన నందు.. చదువు మధ్యలోనే ఆపివేసి ఉద్యమంలో చేరాడు. దళ సభ్యుడిగా ప్రస్థానం మొదలుపెట్టి.. అంచలంచెలుగా ఏవోబీలో కీలక నాయకుడి స్థాయికి ఎదిగాడు.

1987లో పట్టుబడిన నందును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆయనతో పాటు మరో ఏడుగురు నక్సలైట్లను కూడా అదే జైలులో ఉంచారు. వీరిని బయటకు తీసుకువచ్చేందుకు అప్పట్లో నక్సలైట్‌ అగ్రనేతలు.. ఐఏఎస్‌ అధికారులను కిడ్నాప్‌ చేశారు. నందు సహా ఏడుగురు నక్సలైట్లను విడుదల చేస్తేనే అధికారులను విడుదల చేస్తామని పీపుల్స్‌వార్‌ స్పష్టం చేయడంతో ప్రభుత్వం తలొగ్గింది. ఆ ఘటనతో ప్రాచుర్యంలోకి వచ్చిన నందు 20 ఏళ్లకు పైగా ఏవోబీలోనే వివిధ హోదాల్లో పనిచేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement