
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డ గురుకుల పాఠశాలను వరద నీరు చుట్టు ముట్టింది. భారీ వర్షాలు కారణంగా పాఠశాల పక్కనే ఉన్న ఏరు పొంగి ప్రవహిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి ఒకసారిగా వరద చుట్టుముట్టింది. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను స్థానికులు కాపాడారు. అధికారులు అప్రమత్తమై.. బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థినులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
గండికోట జలాశయానికి భారీగా వరదనీరు..
కడప జిల్లా: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గండికోట జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. 30 వేల క్యూసెక్కుల నీరు గండికోటకు చేరింది. మైలవరం నుండి 20 వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరద ఉధృతిపై కలెక్టర్ హరికిరణ్ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.