ఫీల్డ్‌ అసిస్టెంట్‌ హత్య

Field Assistance Murder In Anantapur - Sakshi

గుడిబండ: గుడిబండ మండలం తిమ్మళాపురంలో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మోహన్‌ (32) హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోహన్‌ మోరుబాగల్‌ పంచాయతీలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను స్వగ్రామంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. రెండు, మూడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మోహన్‌ ఇంటి బయట పడుకున్నాడు. సోమవారం ఉదయానికి ఇంటి వెనుక వీధిలో విగతజీవిగా పడి ఉన్నాడు.

కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో అక్కడకు చేరుకుని బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే.. గొంతుకు తాడుతో బిగించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శరీరంపై డ్రాయర్‌ మాత్రమే ఉంది. ఇంటి బయట పడుకుని ఉన్న యువకుడిని దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లి, గొంతుకు తాడు బిగించి చంపి పడేసి ఉంటారని తెలుస్తోంది. పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి పరిశీలించారు. జాగిలాలు మృతుడి ఇంటి వద్ద నుంచి మరో ఇంటి వద్ద వరకు వెళ్లి ఆగాయి. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో హత్యకు గురయ్యాడా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. హతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ శుభకుమార్, ఎస్‌ఐ శరత్‌చంద్ర తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top