ఎంసెట్-2013 కౌన్సెలింగ్ జరిగేనా? | EAMCET -2013 during the course of counseling? | Sakshi
Sakshi News home page

ఎంసెట్-2013 కౌన్సెలింగ్ జరిగేనా?

Aug 17 2013 2:34 AM | Updated on Sep 2 2018 4:46 PM

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌కు ముహూర్తం నిర్ణయించినా సమైక్యాంధ్ర ఉద్యమంతో కౌన్సెలింగ్ నిర్వహణపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి.

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌కు ముహూర్తం నిర్ణయించినా సమైక్యాంధ్ర ఉద్యమంతో కౌన్సెలింగ్ నిర్వహణపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నెల 19 నుంచి 30 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలి సిందే. ఇంతకుముందు జూన్ 20 నుంచి దీన్ని నిర్వహిం చాలనుకున్నా సాధ్యం కాలేదు. బీ కేటగిరీ సీట్ల భర్తీ అం శం కోర్టులో ఉన్నందున సాధ్యం కాలేదు.  కోర్టు ఆదేశం మేరకు కౌన్సెలింగ్ తేదీలు ప్రకటించినా  ఉవ్వెత్తున సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం.. దానికి తోడు కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన పాలిటెక్నిక్ అధ్యాపకులు సమ్మె నోటీసు ఇవ్వడం, కౌన్సెలింగ్‌కు సహాయ నిరాకరణ చేస్తామని రెవెన్యూ ఉద్యోగులు ప్రకటించడంతో కౌన్సెలింగ్ జరగడం అనుమానమేన న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈ ఏడాది 4,513 మంది ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష రాశారు.
 
 ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కళాశాలల ఎంపిక విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని కళాశాలలను ఎంపిక చేసుకోవాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. మరో పక్క జిల్లా అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలోనే హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. ప్రైవేట్ వాహనాలు అంతంతమాత్రంగానే తిరుగుతున్నాయి. జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ రాస్తారోకోలు జరుగుతూ వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. 
 
 ఈ పరిస్థితుల్లో ఇచ్ఛాపురం, పలాస, సోంపేట, పాలకొండ, టెక్కలి తదితర ప్రాంతాల విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఒకే ఒక్క హెల్ప్‌లైన్ కేంద్రానికి రావడం కష్టసాధ్యమే. ఈనెల 19 నుంచి 30 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు షెడ్యూల్ ప్రకటించారు. 22 నుంచి ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. 22, 23 తేదీల్లో 1 నుంచి 40 వేల ర్యాంకు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఈ రెండు రోజుల్లో ఆప్షన్లు నమోదు చేయకపోతే, ఆ తర్వాత సర్వర్లు వివరాలు తీసుకోవు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే సాంకేతిక విద్యాశాఖ స్పందించి సర్వర్లను పెంచాలి. విద్యార్థులు సకాలంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన హాజరుకాలేకపోతే మరో అవకాశం ఇవ్వాలి, ఆప్షన్ల నమోదుకు కూడా అదనపు సమయం కావాలి. ఈ వెసులుబాటు ఇవ్వకపోతే విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుంది.
 
 విద్యార్థుల ఇబ్బందులు గుర్తించాలి
 కౌన్సెలింగ్ కేంద్రానికి విద్యార్థి సజావుగా చేరుకునే అవకాశం ఉండాలి. అంటే తప్పని సరిగా బస్సులు తిరగాలి. లేదంటే దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు హెల్ప్‌లైన్ సెంటర్‌కు చేరటం కష్టం. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
 -డాక్టర్ జి.రాజేంద్రకుమార్, ఉపాధి అధికారి, శ్రీశివానీ కళాశాల
 
 కౌన్సెలింగ్‌కు మిస్ అయితే సీటు కోల్పోయినట్లే
 ప్రతి విద్యార్థి కౌన్సెలింగ్‌కు చేరే అవకాశం ఉండాలి. లేదంటే సీటును కోల్పోవలసి వస్తుంది. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థి ధ్రువీక రన పత్రాల పరిశీలన తరువాత ఆప్షన్లు ఇచ్చుకునే పరిస్థితి ఉండాలి. లేదంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
 -దుర్గాప్రసాద్‌రాజు, యాజమాన్య సభ్యుడు, శ్రీశివానీ కళాశాల
 

Advertisement
 
Advertisement
Advertisement