కాలువ కానుక..ఎస్‌ఆర్‌ కానిక!

Corruption In BTP DPR Anantapur - Sakshi

బీటీపీ డీపీఆర్‌లో భారీగా అవకతవకలు

సివిల్‌ వర్క్స్‌ అంచనాల్లో మతలబు

72 లక్షల నుంచి 1.19కోట్ల క్యూబిక్‌ మీటర్లకు పెంపు

టీడీపీ దత్తత సంస్థ ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు

మంత్రి కాలవకు 20 శాతం గుడ్‌విల్‌..?

ఎన్నికల వేళ కళ్లు చెదిరే కుంభకోణం

ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌. జిల్లాకు చెందిన ఓ టీడీపీ ముఖ్య నేత బినామీగా చెప్పుకునే ఈ సంస్థ చేతిలో ఇప్పుడు లెక్కలేనన్ని     పనులు. అధికార పార్టీ అండదండలు ఉండటంతో.. కోట్లాది రూపాయల భారీ కుంభకోణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. తాజాగా బీటీపీ మట్టి పనుల ముసుగులో మంత్రి కాలవశ్రీనివాసులు ఆమోదముద్రతో ఈ సంస్థ ఖాతాలో రూ.342కోట్ల టెండర్‌ చేరిపోయింది. ప్రతిఫలంగా 20 శాతం, అంటే రూ.68 కోట్లు మంత్రి జేబులోకి వెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: సాగునీరు.. రైతులు.. ఆయకట్టు ముసుగులో టీడీపీ నేతలు సాగిస్తున్న ధనయజ్ఞం పరాకాష్టకు చేరింది. ఎమ్మెల్యేలు.. మంత్రులకు గంపగుత్తగా కోట్లాది రూపాయలు ఇంటికి చేర్చే ఆదాయ వనరుగా భారీ నీటిపారుదల శాఖ మారిపోయింది. ఇందుకు ససాక్ష్యాలే 36వ ప్యాకేజీ, పేరూరు. తాజాగా ఆ జాబితాలో బీటీపీ కూడా చేరిపోయింది. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్న నిధులను వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసే ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను తరిచి చూస్తే అవినీతి ఉప్పొంగుతున్న విషయం ఇట్టే అర్థమవుతుంది. హంద్రీనీవా పథకంలో భాగంగా 36వ ప్యాకేజీలో 80,600 ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.336 కోట్లతో జీడిపల్లి నుంచి రాయదుర్గం నియోజకవర్గం వరకు కాలవ తవ్వనున్నారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్యాకేజీ నుంచే బీటీపీకి నీళ్లిచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ మరో రూ.968.89 కోట్లు ఖర్చ చేసి జీడిపల్లి నుంచి ప్రత్యేకంగా మరో కాలువ తవ్వేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో సివిల్‌ వర్క్స్‌కు సంబంధించి టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. 1.19కోట్ల క్యూబిక్‌ మీటర్ల కాలవ తవ్వేందుకు టెండర్లను ఆహ్వానించారు. వాస్తవానికి మట్టి పని ఆ మేరకు లేదని తెలుస్తోంది. 72      లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనికి.. అదనంగా 47లక్షల క్యూబిక్‌ మీటర్లు చేర్చి డీపీఆర్‌లో చూపడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

చక్రం తిప్పిన మంత్రి కాలవపెంచిన అంచనాల మేరకుమట్టి పనుల్లో టెండర్‌ దక్కించుకున్న సంస్థకు 47లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేయకుండానే బిల్లు వచ్చే పరిస్థితి. ఈ అంచనాలను డీపీఆర్‌కు ముందు ప్రతిపాదనలు పంపే సమయంలోనే సర్వే చేసిన ఓ ఏజెన్సీతో మాట్లాడి మంత్రి కాలవ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ప్రతిపాదనలు నీటిపారుదల శాఖ ముందుకు వెళ్లిన తర్వాత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో చర్చించి ఆమోదముద్ర వేయించి టెండర్‌ ఖరారు చేయించారు. మంత్రి కాలవకు సన్నిహితుడైన అమిలినేని సురేంద్ర నేతృత్వంలోని ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు ఈ టెండర్‌ దక్కేలా మిగిలిన ఏజెన్సీలు పోటీలో లేకుండా చేసినట్లు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ టెండర్‌ మొత్తంలో 20 శాతం గుడ్‌విల్‌ ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే బీటీపీ వద్ద పైలాన్‌ ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఈ నెలలో ‘అనంత’ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు అంచనా పెంపుపై సీఎంతో పాటు నీటిపారుదలశాఖ ఈఎన్‌సీకి టీడీపీలోని ఓ వర్గం ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ప్రాజెక్టు స్వరూపం ఇదీ
జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప(బీటీపీ)ప్రాజెక్టుకు నీళ్లు తీసుకెళ్లేందుకు రూ.968.89కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రధాన కాలవ, బ్రాంచ్‌ కెనాల్స్, సివిల్‌ వర్క్స్, మెకానికల్‌ వర్క్స్‌ను ఈ మొత్తంతో పూర్తి చేయాలి.
పథకంలో మొత్తం 1,507 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ పనిని సివిల్, మెకానికల్‌ పేరిట రెండుగా విడగొట్టారు.
సివిల్‌వర్క్స్‌కు సంబంధించి కాలవ తవ్వకం, స్ట్రక్చర్ల నిర్మాణ( కల్వర్లు, అక్విడిక్టులు) పనులను రూ.342కోట్లతో ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకుంది. మెకానికల్‌ పనులను బీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఇండియా లిమిటెడ్‌ చేజిక్కించుకుంది.
జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి గరుడాపురం వరకు 28.7 కిలోమీటర్ల ప్రధాన కాలువ తవ్వాలి. ఇందులో 7లిఫ్ట్‌లు(ఎత్తి పోతలు) ఉంటాయి. అక్కడి నుంచి బీటీపీకి మరో 32.625 కిలోమీటర్ల ప్రధాన కాలువ తవ్వాలి. గరుడాపురం నుంచి మరో కాలువ కుందుర్పి వరకు 32.228 కిలోమీటర్లు.
మొత్తం ప్రాజెక్టులో 14 లిఫ్ట్‌లు, 227 స్ట్రక్చర్లు నిర్మించాలి. ఈ పథకం పూర్తయితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, మండలాల్లో 114 చెరువులకు నీర నీరు అందించి 10,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం, అలాగే బీటీపీ ప్రాజెక్టు నుంచి గుమ్మఘట్ట మండలంలోని 12వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు కలిపి మొత్తం 22,300 ఎకరాలకు నీరు అందించాలని డీపీఆర్‌లో పొందుపరిచారు.

రూ.150 కోట్ల దోపిడీ
బీటీపీ ప్రాజెక్టులో రూ.150 కోట్ల దోపిడీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పనులను రివైజ్‌ ఎస్టిమేషన్‌ వేస్తే రూ.150 కోట్లు ఆదా అవుతాయి. ప్రధాన కాలువ, ఉప కాలువలు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, వాటి ప్రవాహ సామర్థ్యం ఎంత అనేది బహిర్గతం చేయాలి. హంద్రీనీవా ప్రధాన కాలువ పనులే కిలోమీటరుకు లక్ష క్యూబిక్‌మీటర్లు వచ్చింది. మరి బీటీపీ కెనాల్‌ను ఈ స్థాయిలో నిర్మించనప్పుడు 1.19 కోట్ల క్యూబిక్‌ మీటర్లు ఎలా వస్తుంది. 72 లక్షల క్యూబిక్‌మీటర్లే ఎక్కువ. ఇది బోగస్‌ సర్వే. తప్పుడు ప్రతిపాదనలతో టెండర్‌ వేసి, ఎన్నికల ముందు దోచుకునేందుకే ఈ పనులు.
– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top