వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు కీలకం

Coronavirus: Services of Volunteers and Secretariat Staff are Crucial  - Sakshi

వలంటీర్‌ మొదలుకొని సీఈవో వరకు నిర్వర్తించాల్సిన విధులపై స్పష్టత

ప్రభుత్వం చెప్పే జాగ్రత్తల్ని ప్రతి వ్యక్తికీ చేరవేసే బాధ్యత వలంటీర్లదే

మండల స్థాయిలో లాక్‌డౌన్‌ అమలు బాధ్యత ఎంపీడీవోలది

పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ 

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలను.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామాల్లో ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరుడికి  తెలియజేసే ప్రక్రియలో వార్డు వలంటీర్లు వారధిగా పనిచేయాల్సి ఉంటుందని పంచాయతీరాజ్‌ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బంది, మండల స్థాయిలో ఈవోపీఆర్‌డీలు, ఎంపీడీవోలు, జిల్లా స్థాయిలో జెడ్పీ సీఈవోలు, డీపీవోలు ఎలాంటి విధులు నిర్వహించాలన్న దానిపై స్పష్టత ఇస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

గ్రామ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుదలకు అవసరమైన చర్యల్లో పాలుపంచుకోవాలి. 
కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలి.
గ్రామ పరిధిలో కరోనా వైరస్‌ అనుమానితులను వేరుగా ఉంచడం, బాధితులకు చికిత్స అందించడంలో ఆరోగ్య కార్యకర్తలు, గ్రామ కార్యదర్శులను సమన్వయం చేసుకోవాలి.
ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయకూడదు.. ఏం చేయాలన్న దానిపై అవగాహన కల్పించాలి. 
సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు నిరక్షరాçస్యులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పాలి. 
గ్రామ పరిధిలో నివారణ చర్యలను వీలైనన్ని సార్లు నిరంతరం సందర్శించాలి.

జెడ్పీ సీఈవోలు.. డీపీవోలు
జిల్లా పరిధిలో కరోనా తీసుకుంటున్న చర్యల అమలులో సీఈవోలు, డీపీవోలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలి. 
కలెక్టర్‌ నాయకత్వంలో జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌లో కలిసి పనిచేయడం.. జిల్లాలోని గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించడం. 

ఈవోపీఆర్‌డీల బాధ్యతలివీ..
పారిశుద్ధ్య అవసరాలకు అనుగుణంగా బ్లీచింగ్‌ పౌడర్‌ వంటి వాటిని గ్రామ సచివాలయాలకు తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవడం.
గ్రామాల వారీగా వాస్తవ పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేయడం. ఎంపీడీవోలు
ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ మండలానికి నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలి.
ప్రభుత్వం ఆదేశించిన లాక్‌ డౌన్‌ చర్యలను మండల స్థాయిలో కచ్చితంగా అమలు చేయడం. 
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనడానికి రోజంతా అందుబాటులో ఉండటం. 

వలంటీర్ల విధులు ఇలా
వలంటీర్లు విధుల్లో వారికి కేటాయించిన 50 కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్యం చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఆ వివరాలను గ్రామ సచివాలయాల ద్వారా వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలి.
కరోనా అనుమానిత వ్యక్తి లేదా వ్యాధి సోకిన వారు ఉంటే వారు పూర్తిగా కోలుకునే వరకు గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. 
కేటాయించిన 50 ఇళ్ల పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుదలకు సచివాలయ సిబ్బందితో కలిసి చర్యలు తీసుకోవాలి.
-  గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు పని ప్రదేశంలో తగిన జాగ్రత్తలు, సామాజిక దూరం పాటించేలా 
చూడాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top