ఆ మూడు జిల్లాల్లో.. 50 శాతానికి పైగా రికవరీ

CoronaVirus Positive Cases Rises To 1525 In Andhra Pradesh - Sakshi

విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువ

ఏపీలో రికవరీ రేటు 28.91.. దేశ సగటు 26.65

రాష్ట్రంలో శనివారం కొత్తగా 62 కేసులు నమోదు

1,525కు చేరిన మొత్తం పాజిటివ్‌ కేసులు

38 మంది డిశ్చార్జి.. 441కి చేరిన మొత్తం కోలుకున్నవారి సంఖ్య 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరోనా వైరస్‌కు చికిత్స తీసుకుంటున్న వారి కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఈ మూడు జిల్లాల్లో రికవరీ రేటు 49 శాతం నుంచి 69 శాతం వరకు ఉంది. విశాఖపట్నం జిల్లాలో 29 మందికి కరోనా వైరస్‌ సోకగా అందులో 20 మంది కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం 9 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఏపీలో రికవరీ రేటు 28.91 శాతం
కాగా, రాష్ట్రంలో వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది. వీరి రికవరీ రేటు దేశవ్యాప్త సగటు కంటే మెరుగ్గా ఉంది. మన రాష్ట్రంలో ఇది 28.91 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా ఇది 26.65గా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 38 మంది కరోనా నుంచి కోలుకోవడంతో వారందరినీ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది. గుంటూరు జిల్లాలో 19, పశ్చిమ గోదావరి, కృష్ణాలో ఏడుగురు చొప్పున.. అనంతపురం, చిత్తూరులలో ఇద్దరేసి.. నెల్లూరులో ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 441కి చేరింది.

రాష్ట్రంలో 1,525 పాజిటివ్‌ కేసులు
రాష్ట్రంలో శనివారం కొత్తగా 62 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,525కి చేరింది.  కాగా, శనివారం ఒక్క మరణం కూడా నమోదు కాలేదని, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 33 వద్దే స్థిరంగా ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో మొత్తం 1,051 మంది చికిత్స పొందుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top