ఎల్జీ గ్యాస్‌ లీకేజీపై హైపర్‌ కమిటీ నివేదిక | Committee Submit Report On LG Polymers Gas Leakage | Sakshi
Sakshi News home page

విశాఖ గ్యాస్‌ లీకేజీపై హైపర్‌ కమిటీ నివేదిక

Jul 6 2020 2:34 PM | Updated on Jul 6 2020 5:25 PM

Committee Submit Report On LG Polymers Gas Leakage - Sakshi

సాక్షి, తాడేపల్లి : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన కమిటీ సభ్యులు, గ్యాస్‌ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నివేదికను సమర్పించారు. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 7న ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృత్తం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను కమిటీ తన నివేదికలో పొందుపరిచింది. (ప్రభుత్వం గొప్పగా వ్యవహరించింది)

అలాగే ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, సీనియర్‌ జర్నలిస్ట్‌లు, అధికారులతో హైపవర్‌ కమిటీ చర్చించింది. నివేదిక సమర్పన సందర్భంగా విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, నగర కమిషనర్‌ ఆర్కే మీనా పాల్గొన్నారు. కాగా విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్‌జీ పాలిమర్స్‌లో మే 7  వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారాంత ప్రభుత్వ సహాయంతో చికిత్స పొంది కోలుకున్నారు.  ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి బాధితులను ఆదుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement