
అమ్మకు దూరమై.. పాలు కరువై..
తల్లి చనుబాల కోసం వారం రోజులుగా వెక్కివెక్కి ఏడ్చిన మూడునెలల చిన్నారి కన్నుమూసింది.
తుర్కపల్లి, న్యూస్లైన్: తల్లి చనుబాల కోసం వారం రోజులుగా వెక్కివెక్కి ఏడ్చిన మూడునెలల చిన్నారి కన్నుమూసింది. అదనపు కట్నం తేవాలని అత్తింటివారు వేధించడంతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, బిడ్డను కడసారి కూడా చూసుకోలేకపోయింది. హృదయ విషాదకరమైన ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగింది. తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన కొక్కండ నర్సింహులు, లక్ష్మీల కూతురు భవానికి ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్కు చెందిన బింగి సంతోష్తో వివాహం జరిగింది.
మూడు నెలల క్రితం వారికి రుషికజన్మించింది. సంతోష్ అనారోగ్యం పాలవడంతో భవానికి అత్తింటివారి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో భవాని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వారం రోజులుగా తల్లిపాలకు దూరమైన చిన్నారి రుషిక అమ్మమ్మ, తాతయ్య వద్దే ఉంటోంది. తల్లి కోసం ఏడ్చి ఏడ్చి అనారోగ్యం బారిన పడి రుషిక బుధవారం మృతి చెందింది.