బాబు థర్డ్‌ రేట్‌ పొలిటీషియన్‌ | Babu third-rate politician | Sakshi
Sakshi News home page

బాబు థర్డ్‌ రేట్‌ పొలిటీషియన్‌

May 11 2017 1:29 AM | Updated on Jul 28 2018 3:39 PM

బాబు థర్డ్‌ రేట్‌ పొలిటీషియన్‌ - Sakshi

బాబు థర్డ్‌ రేట్‌ పొలిటీషియన్‌

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ థర్డ్‌రేట్‌ పొలిటీషియన్‌ (తక్కువస్థాయి రాజకీయవేత్త) అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.

- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజం
- అమెరికా పర్యటనలో నీచస్థాయి వ్యాఖ్యలు చేశారు


సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ థర్డ్‌రేట్‌ పొలిటీషియన్‌ (తక్కువస్థాయి రాజకీయవేత్త) అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం విజయవాడలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు తన హోదాను తక్కువ చేసుకునేంత నీచస్థాయిలో మాట్లాడారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నానంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని సురవరం తీవ్రంగా ఆక్షేపించారు.

ఓడిపోతానని బాబుకు భయమా?
‘‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. మా అభివృద్ధికి సహకరించండి అని అడగడంలో తప్పులేదు. కానీ, ఓడిపోకుండా అన్ని చర్యలూ తీసుకున్నాను అని విజ్ఞత కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా చెబుతారా? కాలిఫోర్నియాలో అమెరికా, భారత్‌ వాణిజ్య మండలి(యూఎస్‌ఐబీసీ) సదస్సులో చంద్రబాబు ప్రసంగం ఓ థర్డ్‌క్లాస్‌ స్పీచ్‌. ఎప్పుడో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ జరిగే ఎన్నికల గురించి అమెరికా వాళ్లకు ఎందుకు?  చంద్రబాబు ఓ థర్డ్‌రేట్‌ రాజకీయవేత్త కూడా కాదేమో!ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని బాబు చెబుతున్నారు.

అంటే దాని అర్థం రిగ్గింగ్‌ చే స్తారా? డబ్బులిచ్చి ఓట్లు కొనేస్తారా? ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తారుమారు చేస్తారా? ఏమిటి ఆయన ఉద్దేశం? ఎన్నికల్లో ఓడిపోతానని చంద్రబాబు అంతగా భయపడుతున్నారా? వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన బాబుకు ట్రాన్స్‌ఫర్మేటివ్‌ చీఫ్‌ మినిస్టర్‌ అవార్డు ఇస్తారా? పరివర్తన అంటే ఇదేనా?’’ అని సురవరం ధ్వజమెత్తారు.

ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థి
‘‘రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటి తరపున ఒక ఉమ్మడి అభ్యర్థిని పోటీకి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ మరింత చొరవ చూపాలి. ’’ అని సుధాకర్‌రెడ్డి కోరారు.

16, 17 తేదీల్లో బైఠాయింపు
కాగా రాయలసీమ జిల్లాల్లో కరువు పరిస్థితులపై ఈ నెల 16, 17 తేదీల్లో 30 గంటల బైఠాయింపు ఆందోళనకు పిలుపు ఇచ్చినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement