
సాక్షి, అమరావతి: తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై అగ్రిగోల్డ్ బాధితులు మరో సమరానికి సన్నద్ధమవుతున్నారు. గత మూడున్నరేళ్లుగా దశలవారీగా ఉద్యమాలు చేపట్టిన బాధితులు ఇకపై వివిధ రూపాల్లో పోరాటాలకు కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలో 19.52 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. పైసా పైసా కూడబెట్టి, అగ్రిగోల్డ్లో పెడితే ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని, ఇక తాము ఎలా బతకాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను మోసం చేసిన అగ్రిగోల్డ్ యజమానులు బెయిల్పై బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారని, రూ.లక్షలు నష్టపోయిన తాము న్యాయం కోసం రోడ్డెక్కితే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ‘స్పెషల్ పర్పస్ వెహికల్’ ఏర్పాటు చేసి, తమను ఆదుకోవచ్చని, అయినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తదుపరి పోరాటంలో భాగంగా డిసెంబర్ 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో బైక్, సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు విజయవాడ ధర్నాచౌక్లో ఐదు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. డిసెంబర్ 28వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ఆమరణ దీక్ష చేపడతామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్షుడు బి.విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు ఆదివారం విజయవాడలో మీడియా సమావేశంలో ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పుతున్నారని, న్యాయం చేయాలని కోరితే అసహనం వ్యక్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఉపప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్కే షరీఫ్, మీడియా కో–ఆర్డినేటర్ యశ్వంత్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.