ఏడేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడంతో ఎట్టకేలకు గ్రామాల్లో సర్పంచ్లు కొలువుదీరారు. అందులో ఎక్కువ మంది మహిళలు.. పదవికి కొత్తవారు ఉండడంతో పాలనా పరమైన సమస్యలు తలెత్తే అ వకాశం ఏర్పడింది.
సాక్షి, మెదక్ డెస్క్:
ఏడేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడంతో ఎట్టకేలకు గ్రామాల్లో సర్పంచ్లు కొలువుదీరారు. అందులో ఎక్కువ మంది మహిళలు.. పదవికి కొత్తవారు ఉండడంతో పాలనా పరమైన సమస్యలు తలెత్తే అ వకాశం ఏర్పడింది. అందుకే ప్రభుత్వం జిల్లాలోని సర్పంచ్లకు విడతల వారీగా శిక్షణ ఇవ్వనుంది. నిధులు, విధులు, బాధ్యతలపై ఆయా శాఖలకు చెందిన అధికారులు, నిష్ణాతులు శిక్షణ ఇస్తున్నారు. అయినా వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఈలోపు పొరపాట్లు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని చట్టం చెబుతోంది. కొద్దిరోజుల క్రితమే ప్రభుత్వం నిధులకు సంబంధించి అధికారాలను అ ప్పగిస్తూ 431జీఓను జారీ చేసింది. నిధులను డ్రా చేసేందుకు ప్రత్యేకంగా జీఓ నంబర్ 432 మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 1,066 పంచాయతీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో వారి పాలన సౌలభ్యం కోసం ‘సాక్షి’ అందిస్తున్న కథనం..
ఐఎస్ఐ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలి
పంచాయతీలకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, ట్యూబ్ లైట్లు, ఇతర పరికరాలు, సామగ్రి కొనుగోలు చేసేముందు నిబంధనలు తెలుసుకోవాలి. అధీకృత డీలర్ వద్దనే ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులను కొనుగోలు చేయా లి. సాదాసీదా వస్తువులు కొనుగోలు చేస్తే పదవికే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొనుగోలు చేసిన పరికరాలు, వస్తువుల నిల్వలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలి. అధికారులు తనిఖీకి వస్తే స్టాక్ రిజిస్టర్ ఆధారంగా కొనుగోలు చేసిన, నిల్వ ఉన్న వస్తువుల వివరాలు పారదర్శకంగా ఉండేలా చూడాలి.
నిధుల వ్యయంలో నియమాలు పాటించాలి
పంచాయతీలకు ఇంటి, నీటి పన్నులతోపాటు ఇతర రూపాల్లో వచ్చే నిధులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. నిధులు వెచ్చిస్తే వాటి వివరాలతో కూడిన వినిమయ ధ్రువపత్రాన్ని ఈఓపీఆర్డీకి సమర్పించాలి. ఏటా డిసెంబర్లో ఆదాయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు, వాటి వ్యయాలు ఆడిట్ చేయించాలి. లేకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతారు.
ఏడాదికి నాలుగుసార్లు గ్రామ సభలు
ఏడాదికి నాలుగుసార్లు గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జనవరి 2, ఏప్రిల్ 14, జూలై 1, అక్టోబర్ 3వ తేదీల్లో గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటిని ఫొటోలు తీసి, గ్రామ సభల్లో ప్రజల అభిప్రాయాలు, వివరాలను జిల్లా అధికారులకు తెలియజేయాలి. సర్పంచు పక్షం రోజులు స్థానికంగా అందుబాటులో లేకపోతే సెలవు పెడుతూ బాధ్యతలను ఉప సర్పంచ్కు అప్పగించాలి. సర్పంచు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిస్తే గ్రామ కార్యదర్శి ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. లేకపోతే పంచాయతీలో ఏ తప్పు జరిగినా కార్యదర్శిని బాధ్యులుగా చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకునేందుకు పాలకవర్గం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి.
కేటాయింపులకు మించి ఖర్చు చేయరాదు
గ్రామ పంచాయతీల్లో నిధులు ఎలా ఖర్చు చేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వేటికి ఎంత శాతం నిధులు కేటాయించాలో స్పష్టంగా పేర్కొంది. వేతనాలకు 30 శాతం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్కు 15 శాతం, అభివృద్ధి పనులకు 20 శాతం, ఇతర ఖర్చులు, స్టేషనరీ కొనుగోలుకు 5 శాతం నిధులు ఖర్చు చేసుకోవాలి. అందులో తేడాలు రాకుండా చూసుకోవాలి.
అభివృద్ధి పనుల ఆమోదంపై ఆచితూచి..
గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టే ముందు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. భవనాల నిర్మాణాలు, రహదారి, మురికి కాలువలు, ఇతర అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించాలి. ఆయా విభాగాల సాంకేతిక నిపుణులు అంచనా వ్యయం నిర్ధేశించి నివేదికలు ఇస్తారు. ఇంజనీరింగ్ అధికారి అభివృద్ధి పని విలువను మెజర్మెంట్(ఎం- బుక్) పుస్తకంలో నమోదు చేస్తారు. ఉప కార్యనిర్వాహక ఇంజనీరు పని నా ణ్యతను పరిశీలిస్తారు. ఏ పని చేయాలన్నా ముందుగా పాలకవర్గంలో మెజార్టీ సభ్యుల ఆమోదం పొందాలి. రూ.2లక్షల నిధులు వ్యయం చేసే పనులకు పాలకవర్గం నిర్ణయం సరిపోతుంది. అంతకంటే ఎక్కువ నిధులు అవసరమైతే డివిజనల్ లేదా జిల్లా అధికారుల అనుమతి పొందక తప్పదు. అనుమతులు లేకుండా పనులు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.
చెక్ పవర్ విషయంలో జాగ్రత్త
చెక్ పవర్ వినియోగం విషయంలో సర్పంచులు జాగ్రత్తగా ఉండాలి. గతంలో చెక్ పవర్ కార్యదర్శి, సర్పంచులకు ఉమ్మడిగా ఉండేది. సర్పంచుల విన్నపం మేరకు ప్రభుత్వం వారికే ఆ పవర్ను కల్పించింది. వస్తువుల కొనుగోలుకు సంబంధించిన పేమెంట్లు, సిబ్బంది వేతనాల చెల్లింపులు చెక్కుల రూపంలోనే సాగాలి. చెక్కుపై సంతకం చేసే సమయంలో అన్ని విషయాలూ పరిశీలించాలి ఉంది. పంచాయతీ రికార్డులను ఇంటి వద్ద పెట్టుకోవడం నేరంగా పరిగణిస్తారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే వాటిని ఉంచడం శ్రేయస్కరం.
తాటిపల్లిలో రెండు దూడలు
ఓ ఆవుకు ఒకే ఈతలో రెండు దూడలు జన్మించాయి. మునిపల్లి మండలం తాటిపల్లి మాజీ సర్పంచ్ అనసూజాప్రభాకర్రెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఆవు శనివారం తెల్లవారుజామున ఈనింది. మొదటి ఈతలో ఓ దూడకు జన్మనివ్వగా తాజాగా శనివారం రెండింటికి ప్రాణం పోసింది. విషయం తెలుసుకున్న స్థానికులు వాటిని ఆసక్తిగా పరిశీలించారు.
- న్యూస్లైన్, మునిపల్లి
ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు
సాధారణంగా మేకలు ఒక ఈతలో రెండు లేదా మూడు పిల్లలకు జన్మనిస్తాయి. కానీ న్యాల్కల్ మండలం రాంతీర్థ్ గ్రామంలో రైతు మల్లప్పకు చెందిన మేక శనివారం ఒకేసారి ఐదు పిల్లలను ఈనింది. పుట్టిన పిల్లలన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి. ఈ మేకను రెండేళ్ల క్రితం కర్నాటక రాష్ట్రంలోని తమ బంధువుల వద్ద కొనుగోలు చేసినట్టు రైతు మల్లప్ప తెలిపాడు. మొదటి ఈతలో రెండు పిల్లలు పుట్టగా శనివారం నాటి రెండో ఈతలో ఐదు పిల్లలు పుట్టినట్టు చెప్పాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ మేక పిల్లలను ఆసక్తిగా తిలకించారు.
- న్యూస్లైన్, న్యాల్కల్