నెల్లూరు: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లోని ఓ గ్రామానికి మాజీ సర్పంచ్ అయిన వ్యక్తి.. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనుమసముద్రంపేట మండలం శ్రీకొలనులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కారులో బుధవారం వచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా, పోలీస్ శాఖ తరహాలో తన వాహనానికి సైరన్ వేసి ఉండటమే వివాదాస్పదమైంది.
వాస్తవానికి రవాణా శాఖ నిబంధనల మేరకు ప్రైవేట్ వాహనాలకు సైరన్లు ఉండకూడదు. అయితే సదరు నేత దీన్ని ఉల్లంఘించి తన వాహనంలో ఆ శబ్దంతో రావడాన్ని చూసిన ప్రజలు అవాక్కయ్యారు. ఇలా ప్రైవేట్ వాహనానికి పోలీస్ సైరన్ ఏమిటని కొందరు ప్రశ్నించగా, తాను వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడే అది ఉందని ఆయన సెలవివ్వడం గమనార్హం. ఆపై సదరు నేత ద్వారా కొందరికి పింఛన్లను మంత్రి ఆనం పంపిణీ చేయించడం విశేషం.


