287వ రోజు పాదయాత్ర డైరీ

287th day padayatra diary - Sakshi

16–10–2018, మంగళవారం 
పెద భీమవరం, విజయనగరం జిల్లా

క్రీడాకారులకు సాయం చేయరుగానీ.. అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తారట!
ఈ పాలనలో సంక్షేమ పథకాల అమలు అంతంత మాత్రమే. అరకొరగా అమలయ్యే ఆ కొన్నింటిలోనూ రాజకీయ వివక్షే. ఇక అర్హులైన పేదలకు న్యాయం జరిగేదెలా? గజరాయునివలసకు చెందిన కృష్ణ అనే సోదరుడికి రెండు కళ్లూ లేవు. అంధుడైన అతనికి దివ్యాంగుల కోటాలో ఎస్సీ కార్పొరేషన్‌ లోను మంజూరైంది. కానీ పార్టీ వివక్షతో జన్మభూమి కమిటీలు లోన్‌ రానీయకుండా చేస్తున్నాయట. లోచర్లకు చెందిన శంకరరావుదీ అదే పరిస్థితి. వృత్తిరీత్యా బైక్‌ మెకానిక్‌. బీసీ కార్పొరేషన్‌ లోన్‌ తీసుకుని చిన్న మెకానిక్‌ షాపు పెట్టుకోవాలని ఆశించాడు. ఆ లోను కోసం నాలుగేళ్లుగా చేయని ప్రయత్నమే లేదు. ప్రతిసారీ జన్మభూమి కమిటీలు సైంధవుల్లా అడ్డుపడుతూనే ఉన్నాయి. అర్హులైన పేదవారిని ఆదుకోని ఆ కార్పొరేషన్లు ఉండి ఏం లాభం?  

ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వోద్యోగాల భర్తీయే లేదు. ఏవో కొన్ని అరకొరగా చేసినవి కూడా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలే. వాటికి కూడా లంచాలిచ్చుకోవాలి.. లేదంటే అధికార నేతల అండదండలైనా ఉండాలి. లక్ష్మీపురానికి చెందిన అనూరాధ కాంట్రాక్టు ఏఎన్‌ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకుందట. ‘అన్నా.. ఎస్సీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారందరిలోనూ నేనే టాపర్‌. ఏ రకంగా చూసినా పక్కాగా ఆ పోస్టు నాకే రావాలి.. కానీ సెలక్షన్‌ లిస్టులో నా పేరే లేదు. పోస్టులన్నింటినీ అధికార పార్టీ నేతలు కావాల్సిన వారికి అమ్మేసుకున్నారు’ అంటూ కన్నీటిపర్యంతమైంది. ఆ దళిత సోదరి అనూరాధ కష్టం అలాఉంటే.. బలహీనవర్గానికి చెందిన ఈశ్వరమ్మది మరోరకం కష్టం.. ఆమె పుట్టుకతోనే పోలియో బాధితురాలు. నడవలేని దివ్యాంగురాలు. అయినా కష్టపడి చదువుకుంది. సొంతకాళ్లపై నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తోంది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లేమో రజక వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. డిగ్రీ చదివి.. డైట్‌ కంప్లీట్‌ చేసి.. టెట్‌లో క్వాలిఫైఅయి.. డీఎస్సీ కోసం ఎదురుచూపులు చూస్తోంది. రేపు, మాపు అంటూ ఎండమావిలా ఊరిస్తూ ఉంది.. ఎప్పటికీ రాని డీఎస్సీ నోటిఫికేషన్‌. అటు ఉద్యోగమూ రాకపోయే.. ఇటు నిరుద్యోగ భృతీ లేకపోయే.. ఇలాంటి వారు ఏమైపోవాలి? ఈ పాలనలో అర్హులైన ఒక్కరికైనా న్యాయం జరుగుతుందా? 

రైఫిల్‌ షూటింగ్‌లో జాతీయ స్థాయిలో చాంపియన్‌ అయిన అభిరామ్‌.. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందలేదని బాధపడ్డాడు. తనతోపాటు టీంలో ఉన్న పొరుగు రాష్ట్రాల సభ్యులకు రైఫిల్‌ కొనుగోలు దగ్గర్నుంచి.. అక్కడి ప్రభుత్వాలు అన్ని విధాలా సాయం చేస్తున్నాయట. మన రాష్ట్రంలో ఉండటమే నేను చేసుకున్న పాపమా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిభావంతులకు చిన్నపాటి సాయం కూడా చేయరుగానీ.. అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తారట.. పతక విజేతలకు నోబెల్‌ బహుమతి ఇస్తారట! 

తెలంగాణలో పనిచేస్తున్న నాన్‌లోకల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కలిశారు. రాష్ట్ర విభజన తర్వాత వారందరూ తెలంగాణలోనే ఉండిపోయారు. తమను సొంత రాష్ట్రం ఏపీకి బదిలీ చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ఎమ్మెల్యే నుంచి.. ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి వరకు.. ఎన్ని వినతిపత్రాలిచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరిలో ఎక్కువమంది ఉత్తరాంధ్రకు చెందినవారే. ఇక్కడ బీసీ కులస్తులైనా తెలంగాణలో మాత్రం ఓసీలుగా గుర్తిస్తున్నారట. హెల్త్‌ కార్డుల విషయంలో, పిల్లల స్థానికత విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వీరి సమస్య పట్ల మానవత్వంతో, చిత్తశుద్ధితో కృషిచేయని ఈ ప్రభుత్వ వైఖరి శోచనీయం.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ లోన్ల లబ్ధిదారులను అర్హతలను బట్టి అధికారులు ఎంపిక చేయాల్సి ఉండగా.. జన్మభూమి కమిటీలకు అప్పగించడంలో ఆంతర్యమేంటి? కేవలం రాజకీయ వివక్ష చూపడానికి.. లంచాలతో పచ్చనేతల జేబులు నింపడానికే కదా?  
-వైఎస్‌ జగన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top