తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి సుప్రభాతసేవను పునఃప్రారంభించనున్నారు.
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి సుప్రభాతసేవను పునఃప్రారంభించనున్నారు. గత నెల 16న ధ నుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి ఆలయంలో సుప్రభాతసేవకు బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తున్నారు. ధనుర్మాసం 14వ తేదీతో ముగియనుండడంతో 15న సుప్రభాతసేవను పునఃప్రారంభించనున్నారు. ఈ నెల 16వ తేదీ పారువేట ఉత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులను ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని పారువేట మండపం వద్దకు తీసుకునివెళ్లి వేట కార్యక్రమం నిర్వహిస్తారు.
తొమ్మిది గంటల్లో శ్రీవారి దర్శనం
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38,130 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 16 కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు 9 గంటలు, కాలిబాట భక్తులకు 4 గంటల్లో దర్శనం లభించింది.