క్వారీలో భారీ పేలుడు

11 killed in blast at quarry in Kurnool district - Sakshi

తెలుగుదేశం పార్టీ నేతల అక్రమ క్వారీలో పేలిన డిటోనేటర్లు

11 మంది కూలీల మృత్యువాత.. 10 మంది గల్లంతు.. ఐదుగురికి తీవ్రగాయాలు

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ కొండపై దుర్ఘటన  

సిలిండర్‌ లీకై వ్యాపించిన మంటలు డిటొనేటర్లకు అంటుకోవడంతో పేలుడు

మృతుల సంఖ్య పెరిగే అవకాశం   

మాంసం ముద్దలు.. రక్తం మడుగులు.. ఘటనా స్థలిలో భీతావహ దృశ్యం

పేలుడు ధాటికి కంపించిన చుట్టుపక్కల గ్రామాలు.. పరుగులు తీసిన ప్రజలు

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందజేయాలి

వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం నేతల డిమాండ్‌

అక్రమ క్వారీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోని ప్రభుత్వం

అధికార పార్టీ నేతల నిర్లక్ష్యానికి అమాయకుల ప్రాణాలు బలి  

పేలుడు ఘటనపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ఎటు చూసినా ముక్కలు ముక్కలైన శరీర భాగాలు..ఏ భాగం ఎవరిదో గుర్తు పట్టలేని పరిస్థితి.. కాలువలా ప్రవహించిన రక్తం..
ఇదీ శుక్రవారం కర్నూలు జిల్లాలోఓ క్వారీలో చోటు చేసుకున్న భారీ పేలుడు తర్వాత కనిపించిన భీతావహ దృశ్యం. అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ధనదాహం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి 12 మంది అమాయక కూలీలు బలైపోయారు. గనుల్లో అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలను కచ్చితంగా పాటించి తీరాలని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఇటీవలే ఆదేశించినా ప్రభుత్వంలో ఇసుమంతైనా చలనం రాలేదు. ఫలితంగా 12 పేద ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.

ఆలూరు/కర్నూలు వైఎస్సార్‌ సర్కిల్‌:  కర్నూలు జిల్లాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఆలూరు మండలం హత్తిబెళగల్‌ వద్ద కొండపైనున్న కంకర క్వారీలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. 10 మంది గల్లంతయ్యారని సమాచారం.

గాయపడిన వారు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితులంతా ఒడిశా, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ క్వారీని తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాస్‌ చౌదరి, అతడి సోదరుడు సువాస్‌ చౌదరి నిర్వహిస్తున్నారు. సంఘటనా స్థలంలో భయానక పరిస్థితి నెలకొంది. భారీ పేలుడు ధాటికి మృతుల శరీరాలు ముక్కలు ముక్కలయ్యాయి. శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.

ఏ శరీర భాగం ఎవరిదో గుర్తు పట్టలేనంతగా మారాయి. గాయపడిన వారు అపస్మారకస్థితిలో వెళ్లారు. షాక్‌కు గురై ఏమీ చెప్పలేకపోతున్నారు. పైగా వారి భాష కూడా ఇక్కడెవరికీ అర్థం కావడం లేదు. దీంతో పేలుడు ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత రావడం లేదు. క్షతగాత్రులను ఆలూరు, కర్నూలు ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పేలుడు తీవ్రతకు మూడు ట్రాక్టర్లు, ఒక లారీ మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి.

పేలినవి ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు!  
క్వారీలో భారీఎత్తున పేలుడు సామగ్రిని నిల్వ ఉంచినట్లు సమాచారం. 300కు పైగా ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు, కిలోల కొద్దీ గన్‌పౌడర్, స్లర్రీ ఎక్స్‌ప్లోజివ్స్, జల్, జిలెటిన్‌ స్టిక్స్‌ లాంటి మందుగుండు అక్కడ ఉందని స్థానికులు చెబుతున్నారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం... ఈ క్వారీలో కొద్ది రోజుల క్రితమే గుంతలు తవ్వి పేలుళ్లు జరిపారు. కొన్ని గుంతల్లో నింపిన మందుగుండు పేలలేదు. శుక్రవారం రాత్రి ముందుగా అక్కడున్న గ్యాస్‌ సిలిండర్‌ లీకై మంటలు చెలరేగాయి. అవి డిటోనేటర్ల వైర్లకు వ్యాపించాయి.

దీంతో ప్రస్తుతం జరిపే పేలుళ్లతో కలిసి పేలని గుంతల్లో ఉన్న డిటోనేటర్లు కూడా ఒకేసారి పేలడంతో పెద్దఎత్తున విస్ఫోటనం సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. అవి అక్కడున్న షెడ్లకు వ్యాపించడంతో అందులో నిల్వ ఉంచిన 300 డిటోనేటర్లు, గన్‌పౌడర్, జిలెటిన్‌ స్టిక్స్, జల్‌ లాంటి పదార్థాలు కూడా పేలిపోయాయి. గ్రామ శివార్ల వరకూ మంటలు వ్యాపించాయంటే పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డిటోనేటర్లను ఎక్కువ లోతులో అమర్చడం వల్లే భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సాధారణంగా వాటిని నాలుగు అడుగుల లోతులో అమర్చాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా అంతకుమించిన లోతులో అమర్చినట్లు మైనింగ్‌ అధికారులు అనుమానిస్తున్నారు.  
 
మృతుల సంఖ్య పెరిగే అవకాశం  
క్వారీలో 50 మంది దాకా కూలీలు పని చేస్తుంటారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. అక్కడే టెంట్లు వేసుకుని కుటుంబాలతో సహా ఉంటున్నారు. భారీ పేలుడు నేపథ్యంలో వీరిలో చాలామంది చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సంఘటన స్థలంలోకి వెళ్లడానికి అధికారులు అర్ధరాత్రి దాటినా సాహసం చేయలేకపోయారు. అక్కడ మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయన్న సమాచారంతో ఎవరూ Ðవెళ్లలేకపోయారు.  
 
ఆరు గ్రామాల్లో కంపించిన భూమి  
పేలుడు తీవ్రతకు హత్తిబెళగల్‌ గ్రామంలోని 25 మట్టి మిద్దెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అవి కూలిపోయి మీద పడతాయన్న భయంతో ఇళ్ల నుంచి గ్రామస్తులంతా పరుగులు తీశారు. హత్తిబెళగల్‌తోపాటు తుమ్మలబీడు, ఆలూరు, అరికెర, కురువెళ్లి, హులేబీడు, పెద్దహోతూరు తదితర గ్రామాల్లో సైతం భూమి కంపించినంత శబ్ధం రావడంతో తీవ్ర ప్రజలు భయాందోళనకు గురయ్యారు.  
 
మా ప్రాణాలు పోతున్నా పట్టదా?  
హత్తిబెళగల్‌ గ్రామస్తులు ఆలూరు పోలీసుస్టేషన్‌కు చేరుకొని అక్కడే బైఠాయించారు. గనుల తవ్వకాల వల్ల తమ ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నా పట్టించుకోవడం లేదని పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులపై మండిపడ్డారు. నాలుగైదేళ్ల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. క్వారీలో పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా మీరేం చేస్తున్నారంటూ ఆదోని ఆర్డీఓ, తహసీల్దార్‌ నాగరాజు, వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
లీజు గోరంత.. తవ్వేది కొండంత
హత్తిబెళగల్‌ సమీపంలోని కొండ దాదాపు 50 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ కొండలో రోడ్‌మెటల్‌తోపాటు క్వారŠజ్ట్‌ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ గనికి సంబంధించి ఆలూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్‌ చౌదరి, సువాస్‌ చౌదరి సర్వే నంబరు 669లోని కేవలం 10 ఎకరాలకే లీజు పొందినట్లు సమాచారం. లీజుకు తీసుకున్న ప్రాంతంతోపాటు మరికొంత విస్తీర్ణాన్ని ఆక్రమించి అక్రమంగా కంకర తవ్వకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పైగా కూలీల భద్రతకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కనీసం తలకు హెల్మెట్‌ కూడా సమకూర్చలేదు.  
 
కన్పించని ఫోర్టబుల్‌ మ్యాగజైన్‌  
మైనింగ్‌ ప్రాంతాల్లో పేలుడు సామగ్రిని భద్రపరిచేందుకు ఫోర్టబుల్‌ మ్యాగజైన్‌ రక్షణ కవచంగా ఉంటుంది. అందులో ఉంచితే పిడుగులు పడినా షార్ట్‌ సర్క్యూట్‌ కాదు. ఇనుప పెట్టెలోని చెక్కపెట్టెలాగా ఉండే ఫోర్టబుల్‌ మ్యాగజైన్‌ను క్వారీ వద్ద ఉంచకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  
 
సమాచారం ఇవ్వకుండానే పేలుళ్లు  
వాస్తవానికి క్వారీలో భారీఎత్తున పేలుళ్లు జరపాలంటే స్థానిక పోలీసులతోపాటు రెవెన్యూ, మైనింగ్, మైన్‌సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సమీప గ్రామాల ప్రజలకు ముందుగానే తెలియజేయాలి. అయితే, అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి రాత్రి, పగలు తేడాలేకుండా ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  
 
నిబంధనలు బేఖాతర్‌  
మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారుల ఉదాసీనతతోపాటు అధికార పార్టీ అండతో మైనింగ్‌ వ్యాపారులు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మైనింగ్‌ ప్రాంతంలో ప్రతి ఏడు అడుగులకు ఒక బెంచ్‌ నిర్మాణం(ర్యాంపు) చేపట్టాలి. అయితే మీటర్ల కొద్దీ బెంచ్‌లను ఏర్పాటు చేయకపోవడం, ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

బెంచ్‌ల నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ ఏడాది మార్చి 29న వెల్దుర్తి మండలం సిద్దనగట్టు గ్రామంలోని సుద్దక్వారీలో జేసీబీ బోల్తా పడి నాగరాజు, హరి అనే కూలీలు మృతి చెందారు. అదే విధంగా ఇసుక డంప్‌ వద్ద నిబంధనలు పాటించకపోవడంతో జూలై 15న మల్లేపల్లె గ్రామం వద్ద లక్ష్మిదేవి అనే మహిళ ఇసుక దిబ్బలు పడి మృతి చెందింది. రెండేళ్ల క్రితం ప్యాపిలి మండలం చండ్రపల్లె గ్రామంలో క్వారీలోని మట్టి దొర్లి నలుగురు చనిపోయారు. జూలై 21న సి.బెళగళ్‌ మండలం పలుకుదొడ్డి గ్రామంలోని కంకర క్వారీలో పేలుళ్లకు ఉపయోగించే క్రమంలో ట్రాక్టర్‌ మీద పడి బోయచంద్రశేఖర్, ముల్లామస్తాన్‌ వలీ అక్కడికక్కడే మృతి చెందారు.  
 
టీడీపీ నేతలకు ఉసురు తగలక తప్పదు  
‘‘అధికార టీడీపీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వారికి ఉసురు తప్పకుండా తగులుతుంది. క్వారీ యజమానిపై  గ్రామస్తులు పలుమార్లు పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. లీజుదారులకు ఇచ్చిన దానికంటే ఎక్కువ భాగాన్ని డిటోనేటర్లతో పేల్చడం దారుణం. ఇప్పటికైనా ఇక్కడ జరుగుతున్నా అక్రమాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి’’    – గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే, ఆలూరు  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top