తాడేపల్లి : మంత్రాలయం, గాజువాక ఘటనలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రెండు వేర్వేరు ఘటనలో పలువురు మృత్యువాత పడటంపై వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రాలయం తుంగభద్ర నదిలో ఈతకు దిగిన ఘటనలో ఐదుగురు, గాజువాక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘తుంగభద్ర నదిలో మునిగి ఐదుగురు మృతిచెందడం విషాదకరం. ఈతకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని వైఎస్ జగన్ సంతాంప వ్యక్తం చేశారు.
ఇక గాజువాక రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడటంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు.
కాగా, మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన సంగతి తెలిసింద. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు. వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు.
అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. వీరి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. వారంతా విగత జీవులుగా మిగిలిపోయారు.
ఈ విషాద ఘటనలో ఇద్దకు హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర, సతీష్లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది.
మరొకవైపు ఈరోజు(ఆదివారం, మే 31) ఉదయం గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.


