● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామ్గోపాల్
కడప అర్బన్ : జాతీయ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రామ్ గోపాల్ కోరారు. శనివారం కడప జిల్లా కోర్టు సముదాయ ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి.. జిల్లా నాలుగవ అదనపు న్యాయమూర్తి జి.ఎస్.రమేష్ కుమార్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏడవ అదనపు జిల్లా న్యాయస్థానంలో జరిగిన ఒక కేసులో రూ 1.20 కోట్ల పరిహారం మంజూరయ్యేలా పరిష్కారం జరిగిందన్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న అనే యువతి పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఖాజీపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని పేర్కొన్నారు. ఆమె భర్త మధుసూదన్, పిల్లలకు, కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందజేసినట్లు చెప్పారు. అదే విధంగా కోడూరు శశిధర్రెడ్డి మృతి చెందిన కేసులో మొదటి అదనపు జిల్లా న్యాయస్థానంలో ఆయన భార్య కంభం గౌతమి, చిన్నారి కుటుంబానికి రూ.1.30 కోట్ల పరిహారం అందేలా కేసు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రొద్దుటూరులో రూ.1.05 కోట్ల పరిహారానికి సంబంధించిన మరో కేసు పరిష్కారమవుతున్నట్లు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసులు, సిబ్బంది, పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ధన్యవాదాలు తెలిపారు.
92,091 కేసుల పరిష్కారం
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారంగా కడపలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 29 బెంచీలలో 92,091 కేసులకు పరిష్కారం లభించింది. కక్షిదారులకు రూ.6 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించారు. కేసుల పరిష్కారంలో ఉమ్మడి కడప జిల్లా రాష్ట్రంలో రెండవ ర్యాంకును ఇప్పటి వరకు సాధించింది. ఇంకా కేసుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది.


