కడప అర్బన్ : అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖలో అందుబాటులోకి వచ్చిన నూతన ఆధునిక వాహనాలు, పరికరాల వినియోగంపై అగ్నిమాపక అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. జోన్ –4 పరిధిలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని వివిధ అగ్నిమాపక కేంద్రాలకు కేటాయించిన నూతన ఆధునిక అగ్నిమాపక వాహనాలు, పరికరాల పనితీరుపై శిక్షణ ఇచ్చారు. కడప నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మైదానంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. వాహనాల పనితీరు, అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించే విధానం, పరికరాల నిర్వహణ, సాంకేతిక అంశాలపై సంబంధిత వాహనాల తయారీ సంస్థల ప్రతినిధులు అగ్నిమాపక అధికారులకు, సిబ్బందికి ప్రత్యక్ష అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాల సమయంలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు, తక్కువ సమయంలో ప్రమాద ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో జోన్–4 పరిధిలోని వివిధ జిల్లాలకు చెందిన అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కడప సహాయక జిల్లా అగ్నిమాపక అధికారి బి. యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, చిత్తూరు, నంద్యాల, అనంతపురం ఏడీఎఫ్ఓలు వై.చిన్న బజారి, పి.బి.శివారెడ్డి, ఎస్.నాగరాజు నాయక్, వై.కరుణాకర్, వి.రఘునాథ్, ఎస్.అశ్వర్థ్, అగ్నిమాపక కేంద్రాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


