మైదుకూరు: సులువైన మార్గంలో చేపలు పట్టాలనే ప్రమాదకర ప్రయత్నం ఓ బాలుడి ప్రాణాన్ని బలిగొంది. చెరువు నీటిలో కరెంట్ తీగ ముంచుతుండగా షాక్ కొట్టి ‘చందా అఖిల్ (15)’ అనే పదో తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన గురువారం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని కోనాయపల్లెలో చోటుచేసుకుంది. లింగాలదిన్నె చెరువు గుంతల్లో తండ్రి పెద్ద వెంకటస్వామితో కలిసి అఖిల్ చేపల వేటకు వెళ్లాడు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి దొంగతనంగా లాగిన కరెంట్ తీగను నీటిలో ముంచి, చేపలు పైకి తేలగానే పట్టడం తండ్రికి అలవాటు. గురువారం ఉదయం అఖిల్ ఆ విద్యుత్ తీగను నీళ్లలోకి ముంచే క్రమంలో, తీగకు అతుకులు ఉన్న చోట పట్టుకోవడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాడు. కళ్లముందే కుమారుడు మరణించడంతో తండ్రి తీవ్ర అస్వస్థతకు గురవగా ఆసుపత్రికి తరలించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


