
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ‘బాబు’
4న వెన్నుపోటు దినం విజయవంతం చేయాలి
మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా
కడప సెవెన్రోడ్స్: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా ధ్వజమెత్తారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించారని విమర్శించారు. అందుకే ఈనెల 4వ తేదీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిన సందర్భాన్ని పురస్కరించుకుని వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
ఎన్నికల హామీలు తుంగలో..
తాను అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే రూ. 3 వేల భృతిగానీ చెల్లిస్తామని బాబు చెప్పిన హామీ ఏమైందని అంజద్బాషా ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద యేటా రూ. 20 వేలు చొప్పున పెట్టుబడిసాయం అందించడం ద్వారా రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామి ఎక్కడికి పోయిందన్నారు. పంటలకు గిట్టుబాటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పంటలు నష్టపోయిన వారికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం లేదన్నారు. ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకునే వారు ఉంటే అంత మందికి తల్లికి వందనం కింద రూ. 15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.
సీ్త్ర శక్తి కింద 18+, 60 ఏళ్లలోపు మహిళలకు రూ. 15 వేలు ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చెప్పి కొందరికి మాత్రమే ఇప్పటికి ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకపోవడం వల్ల చాలామంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువులుకు స్వస్తి చెప్పే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి దీవెన పూర్తిగా రద్దు చేయడం అన్యాయమన్నారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు పెన్షన్ ఇస్తామన్న హామి ఇంతవరకు అమలు కాలేదన్నారు.
ఉద్యోగులకు నాలుగు డీఏ బకాయిలు, పీఆర్సీ, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు రూ. 20 వేల కోట్ల అరియర్స్ ఇవ్వాల్సి ఉందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే రేషన్ సరఫరా చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు రేషన్ డోర్ డెలివరీ రద్దు చేసి పాత పద్దతిని పునరుద్దరించడం వల్ల పేదలు, మహిళలు రాత్రి 8.30 గంటల సమయంలో కూడా ఎఫ్పీ షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
సమావేశంలో వైఎస్సార్ సీపీ చేతివృత్తుల విభా గం రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్, కార్పొరేటర్ షఫీ, నాయకులు యానాదయ్య, వేణుగోపాల్ నాయక్, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అమరావతి తప్ప సీమ, ఉత్తరాంధ్ర పట్టడం లేదు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప ఏమి పట్టడం లేదని అంజద్బాషా విమర్శించారు. తన కోటరీలో ఉన్న రియల్టర్లు, బాబు సామాజిక వర్గానికి చెందిన వారికి మేలు చేసేందుకే అమరావతి నిర్మిస్తున్నారని ఆరోపించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, అయితే ఎంతో వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని విస్మరించడం అన్యాయమన్నారు. టెన్త్ పరీక్షా ఫలితాలు వచ్చాక 66 వేల మంది విద్యార్థులు రీ కరెక్షన్ కోసం దరఖాస్తు చేయడం మంత్రి లోకేష్ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 4వ తేది ఉదయం 10 గంటలకు కడప నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించనున్న ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.