వైద్య ఉద్యోగులు.. బదిలీల గుబులు
కడప రూరల్: ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ ముగిసింది. అయితే వైద్య ఆరోగ్య శాఖకు ఇంత వరకు గైడ్లైన్స్ రాలేదు. దీంతో ఆ శాఖ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీల తంతు ముందుకు సాగడం లేదు.
వేలాది మంది ఉద్యోగులు..
ప్రభుత్వ శాఖల్లో వైద్య ఆరోగ్య శాఖ కీలకమైనది. కడప పాత రిమ్స్లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4) పరిధిలో రాయలసీమలోని అన్ని జిల్లాల్లో దాదాపు 17 కేడర్లకు సంబంధించి 12 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో అధిక సంఖ్యలో వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగులు ఈ శాఖ పరిధిలోకే వస్తారు. ప్రభుత్వం ఇటీవల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇంత వరకు ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ రాలేదు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 143 జీఓ ప్రకారం చర్యలు చేపట్టాలి. అంటే ఒక కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ నుంచి క్షేత్ర స్థాయి కేడర్ వరకు 14 మంది ఉద్యోగులు ఉండేలా వైద్య సిబ్బందిని సర్దుబాటు చేయాలి. ఈ సర్దుబాటు అంశం ఒక కొలిక్కి రాలేదు. ఈ కారణం చేత బదిలీలు కూడా ఆలస్యమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వైద్యఆరోగ్య శాఖ అవినీతిమయం అయిందని స్వయంగా మంత్రినే ప్రకటించడంతో.. ఆ శాఖను ప్రక్షాళన చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా ఐదేళ్లు ఒకే చోట సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులందరినీ బదిలీ చేయాలి. అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ప్రాంతీయ కార్యాలయాలు, ఇతర విభాగాల్లో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్తోపాటు కొన్ని కేడర్లకు చెందిన ఉద్యోగులను మూడేళ్లు సర్వీసు దాటితే.. తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించారు. అలాగే భార్య,భర్తలు ఉద్యోగాలు చేస్తున్నా, దివ్యాంగులు ఉన్నా నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాలి.
అనుకూలమైన స్థానంలో ఉండటానికి..
ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఉద్యోగులు తమకు అనుకూలమైన చోటికి వెళ్లడానికి, వీలు పడితే ఉన్న స్థానంలోనే ఉండిపోవడానికి ఆలోచిస్తున్నారు. అలాగే కొందరు మాంచి స్థానాల్లోకి రావడానికి పావులు కదుపుతున్నారు. గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాల్లో ఉన్న సభ్యులకు.. నిబంధనల ప్రకారం బదిలీల నుంచి మినయింపు ఉంది. కొందరు ఉద్యోగులు తమ పరపతి, పలుకుబడిని ఉపయోగించి ఈ సంఘాల్లో పని చేస్తున్నట్లుగా లేఖను పొంది.. స్థానికంగానే ఉండటానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం. ఈ శాఖ ఉద్యోగుల్లో గైడ్లైన్స్ అంశం ఉత్కంఠను రేపుతోంది.
ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వైద్య,ఆరోగ్య శాఖలు అవినీతిమయంగా మారాయని
ఆరోపించారు. కొన్ని కేడర్లకు చెందిన ఉద్యోగులను మూడేళ్ల సర్వీసు దాటితే బదిలీ చేయాలని చెప్పారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్కు పచ్చ జెండా ఊపింది. అయితే వైద్య ఆరోగ్య శాఖకు ఇంత వరకు గైడ్లైన్స్ను జారీ చేయకపోవడంతో ఉత్కంఠగా మారింది.
ఆ ఉద్యోగులకు మూడేళ్లు దాటితే బదిలీ
ప్రభుత్వ ఉద్యోగుల స్థానచలనానికి గ్రీన్సిగ్నల్
వైద్య ఆరోగ్యశాఖకు అందని గైడ్లైన్స్
ఆలస్యంతో మరింత ఆందోళన
ఉన్న స్థానంలోనే కొనసాగడానికి విశ్వప్రయత్నాలు
గైడ్లైన్స్ ప్రకారం బదిలీలు
ఇంకా ప్రభు త్వం నుంచి గైడ్లైన్స్ రాలేదు. మార్గదర్శకాలు వస్తే వాటి ప్రకారం బదిలీలను చేపడుతాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియను చేపడుతాం. – డాక్టర్ రామగిడ్డయ్య,
రీజినల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ
ప్రాంతీయ కార్యాలయం
వైద్య ఉద్యోగులు.. బదిలీల గుబులు
వైద్య ఉద్యోగులు.. బదిలీల గుబులు


