
వక్ఫ్ సవరణ చట్టం.. రాజ్యాంగ విరుద్ధం
ప్రొద్దుటూరు కల్చరల్: వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ప్రతినిధి కేఎం అబ్దుసుభాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ముబారక్షాదీ మంజిల్ నుంచి శివాలయం సర్కిల్ వరకు ముస్లింలు భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టసవరణను ముస్లిం సమాజం, ముస్లిం పర్సనల్ లాబోర్డు పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఇది ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉందని తెలిపారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 14, 25, 26కు విరుద్ధంగా ఉందని, ఇస్లాం సంప్రదాయాలు, మత స్వేచ్ఛ, సాంస్కృతిక హక్కులు, మత సామరస్యం, సామాజిక ఐక్యతను ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు.. ఈ సవరణ చట్టానికి వత్తాసు పలకడం ముస్లిం సమాజాన్ని కలచివేసిందన్నారు. 400 ఏళ్ల నాటి స్థలాలకు రిజి స్ట్రేషన్ పత్రాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. దీనివల్ల పురాతన మసీదులు, దర్గాలు ఉనికి కోల్పేయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజల మధ్య అశాంతిని సృష్టిస్తున్నాయన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సాయినాథరెడ్డికి వక్ఫ్ సరవణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ఖాజా, జేఏసీ కన్వీనర్ అబ్దుసమద్, కో కన్వీనర్ సలీం, సభ్యులు రహమతుల్లా, హిదాయతుల్లా, సీపీఐ ఏరియా సమితి కార్యదర్శి సుబ్బరాయుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా, విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి, సీఎంఎస్ నాయకురాలు పద్మ, పలు మసీద్ల ఇమాంలు, ధార్మిక పండితులు, ముస్లిం పెద్దలు, ప్రజాస్వామ్యవాదులు, ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ప్రతినిధి అబ్దుసుభాన్
భారీగా ముస్లింల శాంతి ర్యాలీ

వక్ఫ్ సవరణ చట్టం.. రాజ్యాంగ విరుద్ధం