భువనగిరి: సీఈఐఆర్ వ్యవస్థ సమర్థంగా పనిచేయడం వల్లే జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వేగంగా రికవరీ చేయగలుగుతున్నామని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. జిల్లా పోలీసులు రికవరీ చేసిన రూ. 20 లక్షల విలువైన 100 మొబైల్ ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు ఆయన స్వయంగా అందజేశారు. ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు అందగానే వివరాలను సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేస్తామన్నారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లను ట్రాక్ చేసి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ బాబు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తూకం వేయకుండానే బియ్యం సరఫరా చేశారు
భువనగిరిటౌన్ : జిల్లాలోని రేషన్ దుకాణాలకు తూకం వేయకుండానే ఆగస్టు మాసం బియ్యం సరఫరా చేశారని రేషన్ డీలర్ల సంఘం ఆరోపించింది. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుగల రాజయ్య ఆధ్వర్యంలో కలెక్టర్తో పాటు జిల్లా పౌర సరఫరాల అధికారికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. దుకాణాలకు సరఫరా చేసే క్రమంలో తూకం వేయకపోవడం వల్ల బియ్యం పరిమాణం తగ్గి లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గత 2025 ఏప్రిల్ నెల నుంచి రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం స్టాక్ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోయిలగూడెం వెంకటేష్, రాష్ట్ర మాజీ కార్యదర్శి రేపాక రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు మన్నె యాదగిరి, రాష్ట్ర మాజీ కోశాధికారి గంగాదేవి మహేష్, జిల్లా సభ్యుడు శ్రీనివాస్, మోత్కూరు ఐఎంజీ పాయింట్ అధ్యక్షుడుసైదులు, వివిధ మండలాల అధ్యక్షులు హరి కిషన్, బుచ్చయ్య, దశరథ, నవీన్, సోమకాని రాజు, ప్రధాన కార్యదర్శులు నరసింహ, కృష్ణ, కూరాకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మల్లేష్, సత్యం, కోశాధికారి పగిడిపల్లి ఆంజనేయులు, డీలర్లు అమతమ్మ, కృష్ణవేణి, పిట్టల అశోక్, వెంకట్ రెడ్డి, అంజయ్య, కుమార్, ప్రవీణ్ పాల్గొన్నారు.
కేంద్ర వేతన సలహా బోర్డులో సీఐటీయూను చేర్చాలి
భువనగిరిటౌన్ : కేంద్ర కనీస వేతనాల సలహా బోర్డులో సీఐటీయూ, ఏఐటీయూసీ , ఐఎన్టీయూసీ వంటి ప్రధాన సెంట్రల్ ట్రేడ్ యూనియన్లకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ డిమాండ్ చేశారు. భువనగిరి మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాయ కృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్లకు కొమ్ముకాసే బీఎంఎస్ వంటి సంఘాలకు మాత్రమే బోర్డులో చోటు కల్పించి, కార్మికుల పక్షాన నిలిచే యూనియన్లను పక్కన పెట్టడం దారుణమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు గాయపాక శీను, బానోత్ శంకర్, మన్నే రాజు, ఇటికల రాజలింగం, కొండ యాదమ్మ, కంచనపల్లి సునీత, కుశంగల నిర్మల, రంగా ఎల్లమ్మ పాల్గొన్నారు.


