ప్రభుత్వాలు మారినా ఫలితం లేదు
నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తాం
భూదాన్పోచంపల్లి: భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు–రుద్రవెల్లి గ్రామాల మధ్య మూసీ నదిపై చేపట్టిన హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం పదేళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే దర్శనమిస్తోంది. నిధులు మంజూరవుతున్నా, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఉదాసీనత వల్ల పనులు టెండర్ల దశ దాటడం లేదు.
మూడుసార్లు నిధులు..
నిజాం కాలం నాటి పాత లోలెవల్ బ్రిడ్జి శిథిలంకావడంతో, 2016 జూన్లో నాబార్డు కింద రూ.8.50 కోట్లతో పనులు ప్రారంభించారు. కానీ భూసేకరణ జాప్యం వల్ల 2021 నాటికి నిధులు ల్యాప్స్ అయ్యాయి. అనంతరం ఎస్సీ, ఎస్టీ సబ్–ప్లాన్ కింద రూ.10.50 కోట్లు మంజూరు చేయగా, కేవలం 8 పిల్లర్లు నిర్మించిన కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదంటూ పనులను మధ్యలోనే నిలిపివేశారు. ఇటీవల ప్రభుత్వం హెచ్ఎండీఏ కింద రూ.18.50 కోట్లు కేటాయించింది. మొదటిసారి టెండర్లకు ఎవరూ రాకపోగా, రెండోసారి పిలిచిన టెండర్లు ప్రస్తుతం పరిశీలన దశలోనే మూలుగుతున్నాయి.
వర్షాకాలంలో రాకపోకలు బంద్
పోచంపల్లి, బీబీనగర్ మండలాల ప్రజలకు ఈ రోడ్డే ప్రధాన మార్గం. మూసీ నదికి వరద వచ్చిన ప్రతీసారి లోలెవల్ బ్రిడ్జి మునిగిపోతోంది. దీనివల్ల రుద్రవెల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు జూలూరు జెడ్పీ హైస్కూల్కు వెళ్లలేక బంద్ అవుతున్నారు. బీబీనగర్లోని పరిశ్రమలకు వెళ్లే స్థానిక యువకులు, వ్యాపారులు గమ్యస్థానాలకు చేరుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.
ఫ పదేళ్లుగా సాగుతున్న పనులు
ఫ మూసీ నది ఉప్పొంగితే నిలిచిపోతున్న రాకపోకలు
ఫ హెచ్ఎండీఏ ద్వారా రూ.18.50 కోట్లు మంజూరైనా ముందుకుసాగని టెండర్ల ప్రక్రియ
ప్రభుత్వాలు మారినా పదేళ్లుగా జూలూరు–రుద్రవెల్లి మూసీ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. ప్రతి వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నిధులు మంజూరైనా పనులు ఎందుకు చేపట్టడం లేదో అధికారులు చెప్పాలి. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని పనులు త్వరగా పూర్తి చేయించాలి.
– దిండు బాలరాజు, జూలూరు
టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం టెండర్ల పరిశీలన ప్రక్రియ నడుస్తోంది. ఇది పూర్తయిన వెంటనే నెల రోజుల్లో పనులు ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తాం.
– వెంకన్న, హెచ్ఎండీఏ ఏఈ


