భువనగిరిటౌన్ : గౌరవెల్లి–భద్రాచలం ఎన్హెచ్ 930పీ జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు 2022 నాటి పాత రిజిస్ట్రేషన్ ధరల ప్రకారం కాకుండా, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలని పోచంపల్లి, వలిగొండ మండలాల బాధిత రైతులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
రైతుల ప్రధాన డిమాండ్లు
బాధిత రైతులు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి ధర రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఉండగా, ప్రభుత్వం 2022 నాటి పాత విలువల ఆధారంగా నామమాత్రపు పరిహారం నిర్ణయించడం సరికాదన్నారు. పోచంపల్లి మండలంలో మార్కెట్ విలువ ఎకరాకు రూ.24–25 లక్షలు ఉంటే, రిజిస్ట్రేషన్ విలువ కేవలం రూ.11–13 లక్షలుగానే ఉందని, వలిగొండ మండలంలో రూ.28–29 లక్షలుగా చూపించారన్నారు. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు పరిహారంతో 5 గుంటల భూమి కూడా కొనలేమని ఆవేదన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలంలో రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు ఎకరాకు రూ.38 లక్షల నుంచి రూ1.20 కోట్ల వరకు పరిహారం ఇస్తూ, ఎన్హెచ్ 930పీ రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారన్నారు. గతంలో కలెక్టర్తో జరిగిన చర్చల్లో 80 శాతం వరకు అదనపు పరిహారం వచ్చేలా చూస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనికోరారు. ఈ నిరసనలో బాధిత రైతులు వారాల శేఖర్రెడ్డి, పాక మల్లేష్యాదవ్, కోడ రామచంద్రారెడ్డి, మల్గా రవీందర్, వెంకట్రెడ్డి, మల్లారెడ్డి, మల్గా వెంకటేశ్, రాములు, రామచందర్, మహేష్, బాణాల ఎల్లారెడ్డి, గూడూరు బుచ్చిరెడ్డి, నొముల మహేందర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, కర్ణాటి ధనుజయ్, పాండు తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారమేచెల్లించాలని కలెక్టర్కు వినతి


