ఆత్మకూరు(ఎం): ప్రకృతి వ్యవసాయం ప్రధాన లక్ష్యం అని ఆత్మ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ దేవ్సింగ్ పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్ల రైతు వేదికలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేసిన రైతు శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం వల్ల సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నేల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ తండ మంజుల, పీఏసీఎస్ డైరెక్టర్ కొడిత్యాల పద్మ, ఆత్మ కమిటీ నియోజక వర్గ చైర్మన్ సుధాకర్, ఏఓ కె. శ్రీనువాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొడిత్యాల నరేందర్ గుప్తా, ఏఈఓలు అశోక్కుమార్, బి. రాజశేఖర్, క్రాంతి, వేణు, సౌమ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలి
రాజాపేట : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి కోరారు. మంగళవారం రాజాపేట జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతిగదిలో విద్యార్థులు పఠనా సమర్థ్యాన్ని, రాసిన ప్రశ్నా పత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టి. రాజు, కిరణ్మయి పాల్గొన్నారు.
తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం
సంస్థాన్ నారాయణపురం: వ్యవసాయంతో పాటు తేనెటీగల పెంపకం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి.వెంకటరమణారెడ్డి సూచించారు. సంస్థాన్నారాయణపురం మండలంలోని మహమ్మదాబాద్లో మల్లేపల్లి ప్రముఖరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తేనెటీగల పెంపకాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం రాష్ట్రస్థాయి కార్యక్రమమైన రైతు నేస్తంలో తేనెటీగల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయానికి అనుబంధ ఉపాధిగా తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారిణి బి.పూజ, వ్యవసాయ విస్తరణ అధికారి కె.రాజేష్, పుట్టపాక మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, ప్రముఖరెడ్డి పాల్గొన్నారు.


