భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం ఉదయం స్వామివారికి అర్చకులు తిరుప్పావడ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 450 కిలోల అన్నప్రసాదం, లడ్డూ, వడ తదితర పిండి వంటలను నైవేధ్యంగా సమర్పించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, తోమాలసేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ప్లాట్లు విక్రయిస్తానని
మోసం చేసిన వ్యక్తిపై కేసు
చివ్వెంల(సూర్యాపేట) : ప్లాట్లు విక్రయిస్తానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణానికి చెందిన కాసర్ల సురేందర్రెడ్డి తనకు ఐలాపురం గ్రామ శివారులో తనకు ప్లాట్లు ఉన్నాయని, తక్కువ ధరకు విక్రయిస్తున్నానని మోతె మండల నర్సింహాపురం గ్రామానికి చెందిన కోడిదల వెంకన్న, కోడిదల కనకయ్య నుంచి నగదు తీసుకున్నాడు. ఆ ప్లాట్లు కూడా ఇతరులకు సంబంధించిన భూమి కాగా.. తనదిగా చూపించాడు. నగదు చెల్లించిన వారు రిజిస్ట్రేషన్ చేయమంటే చేయకపోవడంతో సురేందర్రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సురేందర్రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
కోదాడరూరల్ : అప్పుల బాధ భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన గురువారం కోదాడ పట్టణంలో జరిగింది. పట్టణ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఆసిఫ్ఖాన్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. బెట్టింగ్లకు అలవాటుపడిన అతడు అప్పులపాలయ్యాడు. అప్పుల బాధ భరించలేక శ్రీఇంటి నుంచి వెళ్లిపోతున్నాను.. నా కోసం వెతకొద్దుశ్రీ అని లెటర్ రాసి గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీంతో అతడి భార్య వహిదా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అతడికి నాలుగేళ్ల లోపు వయసున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆసిఫ్ఖాన్ ఆచూకీ తెలిసినవారు 87126 86009 నంబర్ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
విద్యుదాఘాతంతో
మహిళ మృతి
హుజూర్నగర్ : ఇంట్లో ఫ్రిజ్ తెరుస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన హుజూర్నగర్ పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణానికి చెందిన తెప్పని రంగమ్మ(45) బుధవారం అర్ధరాత్రి పాలు ఫ్రిజ్లో పెట్టేందుకు ఇంట్లోని ఫ్రిజ్ డోర్ తెరవగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయింది. గురువారం ఉదయం రంగమ్మ భర్త శ్రీను నిద్ర లేచి చూసేసరికి ఆమె మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


