మిర్యాలగూడ : రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను శనివారం సీపీఎం బృందం పరిశీలించనుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు సరికాదని, ప్రాజెక్టుకు అఖిలపక్షంతో పాటు టెక్నికల్ ఇంజనీర్లను తీసుకెళ్లి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేయాలన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, బోర్లు, చెరువులు, కుంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. మెట్ట పంటలు ఎండిపోతున్నాయని, గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యతను అంచనా వేసి ప్రజలకు తోడ్పడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. భారీ ప్రాజెక్టులు చేపట్టే సమయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలని ఏకపక్ష నిర్ణయాలతో ఈ విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయన్నారు. 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ రూ.32వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.82వేల కోట్లకు డిజైన్ చేశారని అన్నారు. నీటి లభ్యత కోసం డిజైన్ చేయాల్సిన ప్రాజెక్టులను కమీషన్ల కోసం వ్యయాన్ని పెంచి నేడు వివాదస్పదం చేశారన్నారు. ప్రజలకు, రైతులకు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు కట్టాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరపల్లి వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి


