భూదాన్పోచంపల్లి : మండలంలోని దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీకి 2025–26 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్ అందించే అత్యున్నత కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ ఎమినెన్స్ అవార్డు వరించింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ లీడర్షిప్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో క్యాంపస్ ప్రతినిధులకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి కేంబ్రిడ్జ్ ఇంగ్లిష్ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే నేటి ఏఐ యుగంలో ఇంగ్లిష్ విద్యను సరికొత్తగా మలిచి విద్యార్థులను అంతర్జాతీయంగా ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపా రు. ఈ అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
నకిలీ డీఏపీ బస్తాలు సీజ్
మఠంపల్లి : మండలంలోని రఘునాథపాలెంలో ప్రముఖ ఎరువుల కంపెనీ పేరుతో నకిలీ డీఏపీ బస్తాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో బుధవారం వ్యవసాయ అధికారులు, పోలీసులు, డీఏపీ కంపెనీ ప్రతినిధులు దాడులు నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఏడీఏ రవి మాట్లాడుతూ.. అర్హత లేని వ్యక్తులు గత మూడు రోజులుగా రఘునాథపాలెం, చౌటపల్లి, మేళ్లచెరువు తదితర గ్రామాలలో 1000 నకిలీ డీఏపీ బస్తాలను రాత్రివేళ విక్రయించారని తమ విచారణలో తేలిందన్నారు. కొన్ని బస్తాలను పోలీసుల సహకారంతో సీజ్ చేసి కేసు నమోదు చేయించినట్లు తెలిపారు. నకిలీ డీఏపీ బస్తాలలోని శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం కంపెనీకి పంపించామన్నారు. ఈ దాడుల్లో ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్, ఏఈఓలు శ్రావ్య, త్రివేణి, ప్రముఖ డీఏపీ కంపెనీ కంపెనీ జోనల్ మేనేజర్ సుమన్రెడ్డి, మార్కెటింగ్ అధికారి తిరుమల్రెడ్డి, ఆగ్రోనమిస్ట్ నిఖిల్రెడ్డి, శ్రీకాంత్, పోలీసులు పాల్గొన్నారు.
ఊట్కూరులో
కిడ్నాప్ కలకలం
నిడమనూరు : మండల పరిధిలోని ఊట్కూరు గ్రామంలో మంగళవారం రాత్రి కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊట్కూరు గ్రామానికి చెందిన బొల్లేపల్లి శేఖర్ను మంగళవారం రాత్రి గ్రామ శివారులో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి డయల్ 100కు కాల్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. మూడు, నాలుగు గంటల అనంతరం నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు ప్రాంతంలో శేఖర్ను కిడ్నాపర్లు వదిలిపెట్టడంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. కిడ్నాప్కు గురైన ప్రదేశంలో ద్విచక్ర వాహనం దగ్గర పెనుగులాడిన ఆనవాళ్లు లేకపోవడం, బాధితుడు శేఖర్ నుంచి పలువురికి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. శేఖర్ కుటుంబంలో భూవివాదం జరిగినట్లు తెలిసింది. సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. శేఖర్ తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి విజయ్కుమార్ తెలిపారు.


